సమీక్షిస్తున్న డిఎంహెచ్ఒ మీనాక్షి
డిఎంహెచ్ఎఒ మీనాక్షి
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని విలేజ్ హెల్త్క్లినిక్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాజకీయ నాయకుల ఫొటోలతో కూడిన స్టిక్కర్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉండకూడదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కారణంగా వాటిని తొలగించడం గాని, కనిపించకుండా పేపర్లు అతికించడం గాని చేపట్టాని డిఎంహెచ్ఒ డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి ఆదేశించారు. డిఎంహెచ్ఒ కార్యాలయంలో వైద్యులతో, సిబ్బందితో ఆమె మాసాంతపు సమీక్ష మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎఎన్ఎం, ఎంఎల్హెచ్పి ఆరోగ్య సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో నిర్వహించాలన్నారు. అందులో రాజకీయ నాయకుల ఫొటోలు ఉండకుండా రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ సమయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ నెల 31 లోగా ఫార్మసిస్టులు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి మందులు తీసుకోవాలన్నారు. వైద్యాధికారులు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించడం, ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరుగాని నిమ్మరసం, కొబ్బరి నీరు తాగాలన్నారు. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్, ఒఆర్ఎస్ కలిపిన నీటిని తాగడం వల్ల వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం లభింస్తుందని అన్నారు. సమావేశంలో అదనపు డిఎంహెచ్ఒ, ఇతర ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.