డాక్టర్ కుమార్ నాయక్, ప్రధాన కార్యదర్శిగురజాడ నాటక కళా సమితి
నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం
ప్రజాశక్తి- పలాస
ప్రాచీన కాలంలో నాటక రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. వీధి నాటకాలు, పగటి వేషాలు, బుర్ర కథలు, డ్రామాలు వేస్తూ ప్రజలను ఆనందింపజేసేవారు. ప్రస్తుతం సినిమాలు, సెల్లు, టివిలు రావడంతో నాటక రంగం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కానీ, వాటిని సజీవంగా కొనసాగించేందుకు కుమార్ నాయక్ తన జీవిత పర్యంతం శ్రమిస్తునే ఉన్నారు. తెలుగు నాట తొలినాటకం ‘మంజరి మధుకరీం’. 1860లో కోరాడ రామచంద్ర శాస్త్రి రచించారు. 16 వ శతాబ్ధం నాటి చిందు భాగవతం, యశ్చగానం, వీధి బాగోతం నాటి కలు నేటికీ సజీవ సాక్షాలు. కందుకూరి వీరేశలింగం జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 16న ఎపి ప్రభుత్వం 2007లో తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. మంగళవారం తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా కుమార్ నాయక్ పై ప్రత్యేక కథనం. నాటక రంగంలో రాణిస్తున్న కుమార్ నాయక్ 1961లో పలాసలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రంలో పట్టభద్రుడై ‘జానపదుల జాడ యాడున్నదో’ అనే అంశంపై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గ్రామ దేవత ఉత్సవాల్లో కాలి అందియలకు మువ్వలు కట్టి ‘కోయ డాన్స్’ వీధి కార్యక్రమాలు ప్రదర్శించారు. తన 14వ ఏటలో ‘చదువురాని సర్పంచ్’ లఘునాటికతో కళారంగ ప్రస్థానం ప్రారంభించారు. నటునిగా, దర్శకునిగా, న్యాయ నిర్ణేతగా, సందర్భోచిత రచయితగా… కళామతల్లి సేవలో ఉన్నారు.నాయక్ నటించిన నాటికలు, నాటకాలుఅన్ సీజన్లో అల్లుడు నీతి నీ స్థానం ఎక్కడీ,. విజన్ 420, కొడుకే పుట్టాలా?, దాడి, లంకె బిందిలో లక్కాయి పిక్క, పిడికిలి, నాటు మందు, జాలరి జంగమయ్య, చిలక జోస్యం, భైరవకోన, జీవితం, కోయదర కొంటె దంపతులు, కంచం కాదంటుంది, సోది సేబుతాను, కొత్త చిగురు, ఉత్తంగ తరంగం, ట్రీట్మెంట్, చీడపురుగులు, తెలుగు నాటకాలతో పాటు ఒడియా నాటకాలైన బాణహరణం, దుర్దశ, హిందీ నాటకమైన ‘మిలాఖత్’ నాటికలను పలు ప్రాంతాల్లో ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు…పలు కళా సంస్థల్లో…కళారూపాలను, కళాఖండాలను, సాహిత్యాలను, కళాకారులను ప్రోత్సహించాలని, పరిరక్షించాలనే తపనలో కళా సంస్థల ద్వారా సేవలందిస్తున్నారు. ఉషోదయ కళామండలి, సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక, కళింగ సీమ జానపద కళావేదిక, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, గ్రామీణ కళాకారుల సంక్షేమ సంస్థ, లలిత కళ రంజని, గురజాడ నాటక కళాసమితి, సహజ కళా సంస్థ, ఎపి జానపద కళాకారుల సంఘం, విశాఖరత్న కళా పరిషత్, శ్రీకాకుళ రంగస్థలం కళాకారుల సమాఖ్య, ఒడియా కళాకారుల సంఘం, క్రాంతి ఆర్ట్స్, పవనపుత్ర నాట్య కళా మండలి, నవజ్యోతి ఆర్ట్స్, రంగం ప్రజా సాంస్కృతిక వేదిక, భూలోకమ్మ ఆర్ట్స్, దాసరి కల్చరల్ అకాడమీ, శ్రీశ్రీ కళావేదిక, నటరాజ కళానికేతన్, కారుణ్య ఆర్ట్ క్రియేషన్ కళా సంస్థల్లో అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, సలహాదారునిగా, సభ్యునిగా సేవలు అందిస్తునే ఉన్నారు. కళాసేవకు బిరుదులునాటక రంగంలో నిరంతరం సేవలందిస్తున్నందుకు గోపీకృష్ణ ఆర్ట్ థియేటర్ విజయవాడ, మనోరంజని సాంస్కృతిక సంస్థ హైదరాబాద్ (తెలంగాణ), భిలాయి వాణి కల్చరల్ మ్యాగజైన్ భిలాయి (ఛత్తీస్ఘడ్) నిఖిలో కొళాకార్ సంఫ్ు బరంపురం (ఒడివా), జగదీశ్వర నాట్య కళామండలి హైడ్డొ (అండమాన్) మూన్ కరాత్ కల్చరల్ అకాడమీ కలకత్తా (వెస్ట్ బెంగాల్) తిరుమన్నవలై సేవాసమితి అరుణాచలం (తమిళనాడు)లో రాష్ట్రస్థాయి సంస్థలచే కళా సవ్యసాచి, సరస్వతి జ్ఞానపీట్, కళాతేజం, తెలుగు భాషశ్రీ, కళారత్న, కళాసారథి, జానపద రత్న, గురు శ్రేష్ట బిరుదులు ప్రదానం చేశారు. అంతర్జాతీయ, జాతీయ కళాసంస్థలైన శ్రీశ్రీ కళావేదిక, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, ఆంధ్రా సారస్వత పరిషత్ వారిచే ప్రశంసాపత్రాలను అందుకున్నారు.అవార్డులుడాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంత్యుత్సవాలు సందర్భంగా ఆర్కె కళా సంస్థ హైదరాబాదు వారు నిర్వహించిన వేడుకల్లో, జీవితం స్కిట్ ప్లేలో ఉత్తమ నటనకు నంది 2023 పురస్కారాన్ని అందుకున్నారు. గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు రాజమండ్రిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో దుర్దశ ఒడియా నాటిక ఉత్తమ నటనకు నంది 2024 పురస్కారాన్ని అందుకున్నారు.