మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లును సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఫారం-6, 7, 8కి సంబంధించిన వివరాలను వివరించారు. రోజువారీ ఎంసిసి నివేదికలు పంపిస్తున్నామని తెలిపారు. సీజర్ బృందాల ద్వారా చేపడుతున్న చర్యలు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులపై సత్వర చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సి-విజిల్లో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఎస్పి జి.ఆర్ రాధిక మాట్లాడుతూ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం తదితర వివరాలను వివరించారు. జిల్లాలో ఎటువంటి రాజకీయ హింసాయుత వాతావరణం లేదని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్, భరత్ నాయక్, సిహెచ్.రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు, ఎఎస్పి ప్రేమ్కాజల్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.