ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాలు మంగళవారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, గురజాడ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యాన అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు గురువారంతో ముగుస్తాయి. మొదటి రోజైన మంగళవారం స్కూల్, కాలేజీ పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించినట్లు విజ్ఞానకేంద్రం నిర్వహకులు దండు నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఈ పోటీలకు నగరం నుంచి దాదాపుగా 200 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారని షార్ట్ ఫిలిం విభాగం బాధ్యతలు చూస్తున్న ఎల్లాజీ తెలిపారు. ఈ చిత్రలేఖనం పోటీలకు సిహెచ్.భాస్కరరావు, పి.మోహనరావు, వ్యాసరచనకు డాక్టర్ విజయవేణి, పద్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు చివరి రోజు బహుమతి ప్రదానం ఉంటుందని, కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన ఆర్ఎస్ఆర్ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ కె.రమాదేవి మాట్లాడుతూ, పోటీలో పాల్గొన్న విద్యార్థులకు అల్లూరి జీవిత విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పివి.రమణ, సతీష్, ఎంఆర్డి.రాజు, వై.అప్పారావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
![Alluri vignana kendram essay writing](https://prajasakti.com/wp-content/uploads/2024/07/1-essay.jpg)