‘ఆరణి’కి అడ్డుకట్టతెరపైకి ఆవుల మోహన్రంగంలోకి ఎన్వీ ప్రసాద్తిరుపతిలో కొత్త సమీకరణలుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో జనసేన- టిడిపి – బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును ప్రకటించినప్పటి నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ‘స్థానికులకు’ ఎవరికి టికెట్ ఇచ్చినా టిడిపి వారంతా కలిసి పనిచేస్తామని ఆత్మీయ సమావేశంలో ఆయా పార్టీల తిరుపతి శ్రేణులు చెబుతూనే ఉన్నాయి. ఆరణి శ్రీనివాసులును పక్కన పెట్టి తెరపైకి మాజీ ఎంఎల్ఎ ఆవుల మోహన్కు జనసేన కండువా కప్పి అభ్యర్థిగా ప్రకటించాలని సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ రంగంలోకి దిగారు. మరోపక్క సింధూరి వెంకయ్య ఆరణి శ్రీనివాసులుకు మద్దతు ప్రకటిస్తూ తన హోటల్లో సమావేశాలు జరుపుకునేందుకు వీలుగా ఓ అంతస్తును కేటాయించారు. స్థానికేతరుడనడంతో హడావిడిగా పద్మావతిపురంలో వెంకయ్యే స్వయంగా గృహప్రవేశం చేయించారు. టిడిపి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మాజీ ఎంఎల్ఎ సుగుణమ్మ, వూకా విజరుకుమార్, జెబి శ్రీనివాస్, డాక్టర్కోడూరు బాలసుబ్రమణ్యంతో పాటు బిజెపి నాయకులు భానుప్రకాష్రెడ్డి, సామంచి శ్రీనివాస్ తదితరులు మద్దతు కోసం వెళ్లాలని సింధూరి వెంకయ్యే వెనకుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆరణి శ్రీనివాసులు అందరినీ కలుస్తుండగా పై నలుగురిని కలవడానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. టిడిపి అధినేత నారా చంద్రబాబు వద్దకు వెళ్లి తాను జనసేనలో చేరతానని, టిక్కెట్ ఇచ్చేలా పవన్కల్యాణ్కు రికమండ్ చేయాలని ఆవుల మోహన్కు ఎన్వీ ప్రసాద్ డైరెక్షన్ ఇస్తున్నారు. ఆవుల మోహన్ చంద్రబాబును కలవాలని ప్రయత్నించగా మూడు రోజుల వరకూ అవకాశం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. కోడూరు బాలసుబ్రమణ్యం బుధవారం కపిలతీర్థంలో జరిగిన ప్రచారంలో ఆరణి శ్రీనివాసులుతో కలవడం గమనార్హం. అయితే మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సీటు టిడిపికే దక్కించుకోవాలని, జనసేనకు పోతే అభ్యర్థి గెలుపుకు ‘రెబల్’గానే ఉండేలా తీర్మానం చేశారు. టిక్కెట్ కోసం పోటీ పడిన జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్రాయల్ అధినేత పవన్ మాట కాదనలేక అయిష్టంగానే పనిచేస్తున్నారు. ఏదిఏమైనా తిరుపతి కూటమి రాజకీయం రోజుకో మలుపు తిరుగూనే ఉంది. పార్టీలతో నిమిత్తం లేకుండా టిక్కెట్ కోసం ఏ పార్టీ అయినా మారేలా తిరుపతి రాజకీయం మారడం శోచనీయం.