తిరుపతి నుంచి ‘పసుపులేటి’ పోటీ..?గెలిచి ‘పవన్’కు బహుమతిగా ఇద్దాంప్రజాశక్తి – తిరుపతి సిటి ‘తిరుపతిలో అభ్యర్థి ఎవరైనా గెలిచి అధినేతకు బహుమతిగా ఇద్దాం’ అని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. ఓ ప్రైవేట్ హోటల్లో తిరుపతి నియోజకవర్గ సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. తిరుపతిలో జనసేన-టిడిపి అభ్యర్థిని గెలిపించాలని ఏకవాక్య తీర్మానం చేశారు. అనంతరం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కావాలని కోరారు. డివిజన్ ఇన్ చార్జ్ లతో పాటు బూత్ కమిటీలు ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆలోచనలను, జనసేన సిద్దాంతాలను గడపగడపకూ తీసుకెళ్లాలన్నారు. టిడిపి నాయకులు, కేడర్ తో సఖ్యతగా ఉండాలని సూచించారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందువల్ల ప్రతి జనసేన కార్యకర్త… ఒక సైనికుడిగా పనిచేయాలన్నారు. బూత్ లలో ఓటర్ల వివరాలను గుర్తించి వారికి పార్టీ సిద్దాంతాలను వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి పాల్గొన్నారు. తిరుపతి నుంచి పసుపులేటి హరిప్రసాద్ పోటీ చేస్తారని సూచన ప్రాయంగా అధినేత పవన్కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ సమీక్షా సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.