పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలి : కలెక్టర్ప్రజాశక్తి – తిరుపతి టౌన్ జిల్లాస్థాయి ఎన్నికల నోడల్ అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో, పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అలసత్వం ఉండరాదని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీ శ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. సి – విజిల్ లో అందిన ఫిర్యాదులు ఎన్నికల సంఘం సూచించిన 100 నిమిషాల్లో పరిష్కరించాలని సూచించారు. ఎంసిసి ఉల్లంఘనలు ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని, తప్పని సరిగా చర్యలు ఉంటాయని, అధికారులు అందరూ ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హౌర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్దంగా ఎటు వంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించరాదని సూచించారు. సరిహద్దు రాష్ట్రాల నుండి లిక్కరు, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కులశేఖర్ పాల్గొన్నారు.ఈవీఎం గోడౌన్ పరిశీలన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరచిన గోదాములను కలెక్టర్ జి.లక్ష్మి శ బుధవారం సాయంత్రం రాజకీయ పార్టీల రపతినిధులతో కలిసి పరిశీలించారు. పిఒ, ఎపిఒల శిక్షణ నిమిత్తం వినియోగించనున్న వివిప్యాట్లను అత్యంత జాగ్రత్తగా సంబంధిత అధికారులు స్ట్రాంగ్ రూమ్కు తరలించి శిక్షణ నిమిత్తం వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవిఎం గోడౌన్ ఇంఛార్జి ఎస్డిసి కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు.నియమ నిబంధనలు పాటించాలి : అదితి సింగ్ ఎలక్షన్ కమిషన్ రూపొందించిన ఎన్నికల నియమ నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ తెలిపారు.తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఎన్నికల కమిషన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. అర్బన్ ఎంఆర్ఒ వెంకటరమణారెడ్డి, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డిఎస్పి సురేంద్రరెడ్డి పాల్గొన్నారు.