యాదవులకు పదవులిచ్చినా పెత్తందారులదే పెత్తనం: అన్నా రామచంద్రయ్య యాదవ్‌

Mar 27,2024 21:58
యాదవులకు పదవులిచ్చినా పెత్తందారులదే పెత్తనం : అన్నా రామచంద్రయ్య యాదవ్‌

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)రాష్ట్రవ్యాప్తంగా యాదవులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన వారి ఆర్థిక మూలాలను చిదిమేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానాలకు మనస్థాపానికి గురై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అన్నా రామచంద్రయ్య యాదవ్‌ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించకపోవడం దుర్మార్గం కాదా అన్నారు. ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లోనూ, రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లోనూ యాదవులకు ఒక్క శాసనసభ అభ్యర్థిత్వాన్ని అయిన కేటాయించకపోవడం విస్మయానికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి నగరపాలక సంస్థలకు మేయర్లుగా యాదవులకు ప్రాధాన్యం ఇచ్చారే గాని పెత్తనం అంత పెత్తందారీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్లు, రీజనల్‌ కోఆర్డినేటర్ల చేతిలోనే ఉంచుకొని అవమానభారాన్ని మేయర్లపై నెట్టివేశారన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్‌ ను మీ ప్రతిభతో మీకు ఈ స్థానం రాలేదు… మా కాళ్లు పట్టుకుంటే ఇచ్చామని అనడం అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీసీలపట్ల వారికున్న చిత్తశుద్ధిని బయట పెట్టిందన్నారు. భారత రాజ్యాంగం అందించిన ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాచరికపోకడలను అనుసరిస్తున్న వైసిపి పార్టీ నేతల ప్రవర్తనను జీర్ణించుకోలేక రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. నా ఈ రాజీనామా వ్యక్తిగత విషయం మాత్రమేనని, నా కుటుంబ సభ్యుల రాజీనామాలు వారి వ్యక్తిగతమన్నారు.

➡️