భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత : ఈవో ప్రజాశక్తి – తిరుపతి సిటి అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగ్, భద్రత విభాగాలతో కాలిబాట భక్తుల భద్రత చర్యలపై ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఏడవ మైల్ వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటి కప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించి, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేఈవో వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్వో నరసింహ కిషోర్కు సూచించారు. అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారిచ్చిన ప్రతిపాదనలను అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎస్వి జూ పార్క్ క్యూ రేటర్ సెల్వం, తిరుపతి డిఎఫ్ఓ సతీష్, సబ్ డిఎఫ్ఓ శ్రీనివాస్, సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, టిటిడి డిఎఫ్ఓ శ్రీనివాస్, పంచాయతీ ప్రత్యేక అధికారి మల్లికార్జున్, ఆరోగ్య శాఖ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.