తరతరాలకు దార్శనికుడు శ్రీశ్రీ ప్రజాశక్తి – తిరుపతి సిటి, యంత్రాంగం’తరతరాల దార్శనికుడు, అభ్యుదయ కవితా పతాక శ్రీశ్రీ’ అని వక్తలు ఉద్ఘాటించారు. వేమనవిజ్ఞానకేంద్రం, ఈతరం కవితాకవితా వేదిక ఆద్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్థంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీ శ్రీ కవిత్వం ఈ సమాజాన్ని ముందుకు నడిపించే ఇంధనమన్నారు. ప్రధానవక్త గరికపాటిరమేష్ బాబు మాట్లాడుతూ మార్క్సిజం చదవని మార్క్సిస్టు అని కొనియాడారు. ముఖ్యఅతిథి టెంకాయల దామోదరం మాట్లాడుతూ శ్రీశ్రీ కవిత్వాన్ని నేటితరానికి తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమమంలో మల్లారపు నాగార్జున, భూమన్ , సాకం నాగరాజు, తమటం రామచంద్రారెడ్డి , ఆకుల మల్లేశ్వరరావు పాల్గొన్నారు. బిఎన్ కండ్రిగలో..ఆధునిక తెలుగు సాహిత్యానికి కొత్త జవసత్వాలను కల్పించి, కష్టజీవుల కన్నీటి గాథలతో భూకంపాలు సృష్టించిన కవి శ్రీశ్రీ అని ప్రధానోపాధ్యాయులు రూపేష్కుమార్ అన్నారు. శనివారం శ్రీశ్రీ వర్థంతి పురస్కరించుకురుని మండలంలోని కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో ప్రార్థనా సమావేశంలో శ్రీశ్రీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు యువశ్రీ మురళి, ఉపాధ్యాయులు నాదెండ్ల మురళి, ఒబ్బుదేవి ప్రసాద్, వేణుగోపాల్ లక్ష్మయ్య, మాధవీలత, జగన్నాధం, దాసు, మురళిప్రసాద్ పాల్గొన్నారు. ఏర్పేడులో… శ్రామిక, కార్మిక, అణగారిన వర్గ పక్షపాతి శ్రీశ్రీ అని పాపానాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ అమరేశ్వరరెడ్డి సందేశమిచ్చారు. శ్రీశ్రీ ప్రతి కవితా ఆధునిక సమాజానికి దర్పణం అన్నారు. తెలుగు లెక్చరర్ నాదెండ్ల శ్రీమన్నారాయణ, సీనియర్ లెక్చరర్ ఉమ, డాక్టర్ జలగం రామాంజులు, రాఘవరెడ్డి, వెంకట సురేష్, సువర్ణ పాల్గొన్నారు. తిరుపతి రాములవారి దక్షిణ మాడవీధిలో రాయలసీమ రంగస్థలి ఛైర్మన్ గూండాల గోపినాధ్రెడ్డి, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు శ్రీశ్రీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తిరుపతి విశ్వం టాలెంట్ స్కూల్లో శ్రీశ్రీ కళావేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు అరవ జయపాల్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కొల్లి రమావతి, విశిష్ట అతిథులుగా స్కూల్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోతమ్మ నాయుడు హాజరై ప్రసంగించారు. శ్రీశ్రీ పేరు వింటే తెలుగు సాహిత్యం పులకించిపోతుందన్నారు.