తోతాపురి టన్ను రూ.30వేలకు కొనాలి’గుజ్జు’ పరిశ్రమ యజమానులకు కలెక్టర్ హెచ్చరికప్రజాశక్తి – తిరుపతి టౌన్ తిరుపతి జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల, మామిడి ర్యాంపు యజమానులు, మండీ యజమానులు తోతాపురి మామిడికాయలకు టన్నుకు 30 వేల రూపాయలకు తగ్గకుండా ధర రైతులకు చెల్లించాలని, అలా కాకుండా తక్కువ ధర చెల్లించనచో కఠిన చర్యలు ఉంటాయనీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో మామిడి పంట 52వేల ఎకరాలలో సాగు చేస్తున్నారని, ఈ సంవత్సరం మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిందని, సాధారణంగా ఎకరాకు నాలుగు నుండి ఆరు టన్నులు దిగుబడి వచ్చేదని, అయితే ఈ సంవత్సరం ఎకరాకు రెండు టన్నులు కూడా రాని పరిస్థితి నెలకొన్నదని, దిగుబడులు తగ్గడం వలన ధరలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావించారని, అయితే గత నాలుగు అయిదు రోజులుగా మామిడి ధరలు పతనం కావడంపై జిల్లా కలెక్టర్ ఉద్యానవన, మార్కెటింగ్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో మామిడి ధరలపై సమీక్షించారు. ఎవరైనను మామిడికాయలకు (తోతాపురి) టన్నుకు 30 వేల రూపాయలకు తగ్గకుండా చెల్లించాలని ఆదేశించారు. అలాకాకుండా ఎవరైనా టన్నుకు 30 వేల రూపాయలకన్నా రైతులకు తక్కువ చెల్లించినచో అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ మామిడికి ధర కల్పించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రగిరి ఎంఎల్ఎ పులివర్తి నాని ఎన్నికల హామీల్లో భాగంగా మామిడికి గిట్టుబాటు ధర కల్పించారన్నారు.
![తోతాపురి టన్ను రూ.30వేలకు కొనాలి'గుజ్జు' పరిశ్రమ యజమానులకు కలెక్టర్ హెచ్చరిక](https://prajasakti.com/wp-content/uploads/2024/06/Mango-2.jpg)