ప్రజాశక్తి-సీతమ్మధార : ఎఎన్ఎంఎల్గా శిక్షణ పూర్తి చేసుకున్న తమకు రిలీవ్ లెటర్స్ ఇవ్వకుండా పదేపదే గడువును పొడిగించడాన్ని నిరసిస్తూ ట్రైనీ ఎఎన్ఎంలు నిరసన చేపట్టారు. సోమవారం రామాటాకిస్ దరి డిఎంహెచ్ఒ కార్యాలయం వద్ద నిరసన సందర్భంగా యూనియన్ ప్రతినిధి కృష్ణవేణి మాట్లాడుతూ 2022 నుంచి 2024 మార్చి ఒకటవ తేదీ వరకు తాము ఎఎన్ఎఎంఎల్గా రెండేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్నామని, అప్పటోల రిలీవ్ లెటర్ అడిగితే, రెండు నెలల శిక్షణ గడువు పెంచామని, దాన్ని పూర్తిచేసిన వెంటనే రిలీవ్ లెటర్లు ఇస్తామని చెప్పారన్నారు. పెంచిన గడువు మేరకు రెండు నెలల శిక్షణకూడా పూర్తిచేసిన తర్వాత ఇపుడు రిలీవ్ లెటర్లు అడిగితే మరో నెల శిక్షణ పొందాలని సూచిస్తూ రిలీవ్ లెటర్లు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఒలకు విన్నవించి, తమకు న్యాయం చేయాలని వేడుకున్నా స్పందిచడం లేదన్నారు. తాము పొందిన శిక్షణకు రిలీవ్ లెటర్లు ఇస్తే, తమ ప్రాంతాల్లో ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటామని వేడుకుంటున్నా స్పందించడ లేదని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఒ స్పందించి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న ట్రైనీ ఎఎన్ఎంలు