ప్రజాశక్తి-వేపాడ : మండలంలో వల్లంపూడి గ్రామంలో జగనన్న లేఅవుట్ నిరుపయోగంగా మారింది. ఈ లేఅవుట్లో 48 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. లేఅవుట్ లోతట్టు ప్రాంతంలో ఉంది. ఎత్తుగా ఉన్న స్థలంలో పది మంది వరకు ఇళ్లు నిర్మించుకున్నారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న వారు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. గ్రామస్తుల వాడుకనీరు లేఅవుట్లోకి వచ్చి చేరుతుంది. ఏమాత్రం వర్షం కురిసినా అదంతా చెరువులా తయారవుతుంది. దీంతో లేఅవుట్ను ఎత్తు చేస్తే తప్ప ఇళ్లు నిర్మించుకోలేమని లబ్ధిదారులు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్పష్టంచేశారు. సమస్య పరిష్కారానికి అవసరమైన నివేదికను జిల్లా అధికారులకు పంపామని చెప్పడమే తప్ప నేటికీ ఎత్తు చేయలేదు. దీంతో లేఅవుట్ స్థలంలో కొందరు పందులకు పాకలు వేసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, స్థలాన్ని ఎత్తు చేయాలని ఇళ్ల స్థలాల లబ్ధిదారులు కోరుతున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/vpd-story.jpg)