ప్రజాశక్తి-విజయనగరం కోట : శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల పాత్ర కీలకమని అదనపు ఎస్పి అస్మా ఫర్హీన్ అన్నారు. ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు ఏటా నిర్వహించే 15రోజులపాటు పునశ్చరణ తరగతులను సోమవారం ఎఎస్పి ప్రారంభించారు. విధుల్లో నిష్పక్షపాతంగా, అంకిత భావం, నిజాయితీతో వ్యవహరించి, ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడిని జయించేందుకు యోగా, వ్యక్తిత్వ వికాసాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితులను మెరుగుపర్చేందుకు ప్రణాళికాయుతంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. శారీరక దారుఢ్యం పెంచేందుకు, వివిధ ఆయుధాల ఉపయోగాలను, ముఖ్యమైన బందోబస్తు విధులను ఏవిధంగా నిర్వహించాలో, ఫైరింగు ప్రాక్టీసు, బాంబు స్క్వాడ్ పనితీరు ఏవిధంగా చేపట్టాలో, మస్కట్ శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పి యూనివర్స్, ఆర్ఎస్ఐ టి. శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐలు, ఎఆర్ హెచ్సిలు, ఎఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.