అవగాహనా ర్యాలీలో డిటిసి రవీంధ్రనాధ్
ప్రజాశక్తి-విజయనగరం కోట : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రాంతీయ రవాణాశాఖ డిప్యుటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జిఆర్ రవీంధ్రనాధ్ కోరారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవీంధ్రనాధ్ మాట్లాడుతూ, ప్రమాదాలు సంభవిస్తే హెల్మెట్ ధారణవల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చునని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రోడ్డుపై వాహనాలు నడిపేవారే కాకుండా, పాదచారులు సైతం రహదారి భద్రతా నియమాలను తెలుసుకోవాలని సూచించారు. వీటిపై అందరికీ సంపూర్ణ అవగాహన ఉంటే, చాలావరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు. దీనికోసం రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని రవీంధ్రనాధ్ చెప్పారు.రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీని స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిఐ రంగనాధ్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్టిసి కాంప్లెక్స్, మయూరి జంక్షన్, సంతకాల వంతెన, కలెక్టరాఫీసు, ఆర్టిఓ ఆఫీసు వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆర్టిఓ రమేష్, ఎంవిఐలు ఎవి రమణ, యు. దుర్గాప్రసాద్, కెఆర్ఎస్పి ప్రసాద్, ఎఎంవిఐలు వి.శ్రావ్య, వి.ఐర్వర్యలక్ష్మి, సిబ్బంది, భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు పాల్గొన్నారు.