ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించి, బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు నగర అధ్యక్షులు ఎ.జగన్మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని కస్పా పాఠశాలలో ఎస్కె బేగం అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2, 3 నెలల బకాయి వేతనాలు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఆయాలకు పారితోషికాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్ట్టైం వర్కర్స్ అంటూ చెప్పి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయిస్తున్నారని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో స్టడీ అవర్స్ ఉంటే 7 గంటల వరకు ఉండాల్సి వస్తుందన్నారు. నెల వేతనం రూ.6 వేలు సరిపోదని, కనీసం 12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనిఫాం, గుర్తింపు కార్డులు, క్యాజువల్ సెలవులు ఇవ్వాలన్నారు. ఈ సమస్యలపై ఎంఇఒకు ఈ నెల 20న వినతి అందించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో యూనియన్ కార్యదర్శి నందిని, సభ్యులు ఉమా, అభిత బేగం, పార్వతి, సత్యవతి, చిన్నతల్లి, లత, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/vzmt2.jpg)