ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ
చదువుతోనే మంచి భవిష్యత్తు సాధ్యమని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఎతిహాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం ఆధ్వర్యంలో అర్హులైన, వెనుకబడిన విద్యార్థులకు వార్షిక స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం శనివారం సాయంత్రం వెంకోజీపాలెంలోని సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీభరత్ విద్యార్థులతో మాట్లాడారు. వారి భవిష్యత్తు కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. ఎతిహాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ సేవలను మెచ్చుకున్నారు. కార్యక్రమంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, సొసైటీ అధ్యక్షులు ఐహెచ్.ఫరూకీ, కార్యదర్శి జాఫర్ హుస్సేన్, కోశాధికారి రియాజ్ ఖాన్ పాల్గొన్నారు.