కలెక్టర్ సుమిత్కుమార్
ప్రజాశక్తి – భీమవరం
జిల్లాలో తీర ప్రాంతం, లంక గ్రామాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నామని కలెక్టర్ సుమిత్కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డికి తెలిపారు. వేసవిలో తాగునీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, విద్యుత్ సరఫరా, తదితర అంశాలపై వివిధ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి చెరువులను, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను, మంచినీటి చెరువులను కాల్వలు కట్టేసేలోగా పూర్తిస్థాయిలో నింపుకోవాలన్నారు. వేసవికాలంలో తాగునీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ సివి.ప్రవీణ్ఆదిత్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ కానాల సంగీత్ మాధుర్, డ్వామా పీడీ ఎం.ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ శాఖాధికారి ఆర్.విక్టర్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివివి.నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఇఇ ఫీర్అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.