ప్రజాశక్తి – ఉండి
తమ గ్రామానికి రహదారిని పునర్నిర్మించాలని అర్తమూరుకు చెందిన కొంతమంది యువకులు బుధవారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం మండల సిపిఎం కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ధనికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలాల్లోని చెరుకువాడ అర్తమూరు రాష్ట్రీయ రహదారిని పునర్నిర్మించాలని కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులు పలుసార్లు అధికారులు, నాయకుల దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి గోతులమయంగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రోడ్డు భవనాల శాఖ అధికారులకు తమ గోడు విన్నవించుకుందామంటే రోడ్డు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ అందుబాటులో లేరని తెలిపారు. వెంటనే తమ గ్రామానికి రహదారిని పునర్నిర్మించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు తహశీల్దార్ ఏడిద శ్రీనివాస్ను కోరి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రామకూరి వెంకటరత్నం, జి.సంజీవరావు, కె.యోహాను, కె.సురేష్, ఎన్.రాంబాబు, బి.సందీప్, ఎన్.ఏసు, బి.చిన్ని పాల్గొన్నారు.