ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎపి నిట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ ఎన్.జయరామ్ సూచించారు. నిట్ ఇన్ఛార్జి డైరెక్టర్ బిఎస్.మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ పి.దినేష్ శంకర్రెడ్డి పర్యవేక్షణలో తణుకు మాంటిస్సోరీ విద్యార్థులు మంగళవారం నిట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఇండోర్ స్టేడియం, ప్రయోగశాలలు, వర్క్ షాపులు, గ్రంథాలయాన్ని పరిశీలించి, యంత్రాలు, పరికరాల పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జయరామ్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఎవరైతే టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటారో వారు ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకుంటారని తెలిపారు. బట్టీ చదువులు మార్కులు తెచ్చిపెడతాయేగాని విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దలేవని చెప్పారు. రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ వి.సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యూహాలే లక్ష్యంగా దూసుకెళ్లాలన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తినింపేలా భారత శాస్త్రవేత్తల విజయగాధలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.