ఓట్ల లెక్కింపుకు అందరూ సహకరించాలి

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎంతో కీలకం, ఓట్ల లెక్కింపుకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు అన్ని విధాలా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదివారం కోరారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్‌ 4న జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు సెంటర్ల నందు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉదయం 8 గంటలకే మొదలవుతుందన్నారు. మొదట పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని, అనంతరం ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌ హాళ్లలో ఇవిఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపుకు 10 టేబుళ్లు ఏర్పాటుకు తొలుత అనుమతి పొందగా, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అధికంగా పోలైనందున మరో ఐదు టేబుల్స్‌ ఏర్పాటుకు ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి అనుమతి పొందడం జరిగిందన్నారు. మొత్తం 15 టేబుల్స్‌ను పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుకు వినియోగించడం జరుగుతుందన్నారు. 15 టేబుల్స్‌కు సంబంధించి అదనంగా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఏర్పాటు కూడా ఇసిఐ నుంచి అనుమతి పొందడం జరిగిందన్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా అసెంబ్లీ కౌంటింగ్‌ హాల్స్‌ నందు అనుమతి పొందిన నాలుగు టేబుల్స్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాస్తవ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ రెండు కవర్లు ఉంటాయని, బయటి కవర్ను ఫారం 13-సి అంటారని దానిని తెరిచిన తర్వాత రెండు డాక్యుమెంట్లు ఉంటాయని అందులో ఒకటి డిక్లరేషన్‌ 13-ఎ అంటారని, ఇంకొకటి 13-బి కవరులో నిజమైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఉంటుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి గతంలో ఉన్న ఉత్తర్వులను అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు కొంత వెసులుబాటు కల్పిస్తూ సవరణలతో మే 25న మరియొక ఉత్తర్వులను ఎన్నికల కమిషన్‌ విడుదల చేయడం జరిగిందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి డిక్లరేషన్‌ 13-ఎ లో ఓటర్‌ తప్పనిసరిగా సంతకం చేసి ఉండాలన్నారు. ఫామ్‌-13ఎలో ఓటర్‌ సంతకం లేనివాటిని, ఆర్‌ఒ సంతకం, బ్యాలెట్‌ సీరియల్‌ నెంబర్‌లేని వాటిని తిరస్కరించడం జరుగుతుందన్నారు. ఆర్‌ఒ సంతకం ఉన్న పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటు అవుతుందన్నారు. ఆర్‌ఒ సీల్‌ లేకున్నా తిరస్కరించవద్దన్నారు. ఫామ్‌-13ఎపై ఆర్‌ఒ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలన్నారు. ఆర్‌ఒ సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించే రిజిస్టర్‌, కౌంటర్‌ ఫైల్స్‌తో సరిపోల్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా గెజిటెడ్‌ అధికారి ధృవీకరించి సంతకం చేసి స్టాంపు వేయడం గాని లేదా హోదా గాని రాసి ఉండాలన్నారు. అలా ఉంటేనే అది చెల్లుబాటు అవుతుందన్నారు. ఏవైనా ఓట్లు చెల్లుబాటు కాకపోతే 13-సి కవర్లో ఉంచి తిరస్కరిస్తూ వేరుగా పెట్టెలో ఉంచడం జరుగుతుందన్నారు. రిటర్నింగ్‌ అధికారి నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుందన్నారు. ఒక్కో టేబుల్‌కు 500 చొప్పున పోస్టల్‌ బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున కౌంటింగ్‌ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అలాగే పార్లమెంటు రిటర్నింగ్‌ అధికారి వద్దనే సర్వీస్‌ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌(ఇటిపిబిఎస్‌)లను కూడా లెక్కించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఒక టేబుల్‌ను ఏర్పాటు చేస్తామని, ఆ టేబుల్‌ వద్ద కూడా పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఏజెంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు.

➡️