- డిసెంబర్ 9 ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం-
‘ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. వీటన్నిటి మధ్య నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారి పోతున్నది. పారదర్శకత పలుచ బడుతున్నది. అక్రమార్కులు పేట్రేగి పోతున్నారు. నీతిమంతుడు చేతకాని వాడుగా పరిగణించబడుతున్నాడు. అవినీతి రహిత సమాజ స్థాపనకు పూనుకోవడం, మూలాలను అన్వేషించడం, అక్రమార్కులను శిక్షించడం, చట్టాలను రూపొందించి కఠినంగా అమలు పరచడం లాంటి పలు అంశాలను చర్చించే ఐరాస వేదికగా ”అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని” 2005 నుంచి ప్రతి ఏట డిసెంబర్ 9న పాటించటం ఆనవాయితీగా మారింది.
ఐరాస గణాంకాల ప్రకారం ప్రతి ఏట 1 ట్రిలియన్ డాలర్లు అవినీతిపరుల జేబులకు చేరుతూ, 2.6 ట్రిలియన్ డాలర్లు అక్రమ మార్గంలో దోపిడీకి గురవుతున్నాయి. ప్రపంచ జిడిపిలో 5 శాతం వరకు అవినీతిపరుల చేతులు మారుతున్నది. మానవాళి సమగ్రాభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలుస్తున్న అవినీతి అంతానికి ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, బాధ్యతగల పౌరులు, ప్రైవేట్ సంస్థలు తమ వంతు చేయూతను ఇవ్వాలి. అవినీతి పెరిగితే పేదరికం, అశాంతి, హింస, ఆర్థిక మందగమనం, నేర ప్రవృత్తి, ఆకలి చావులు, ఆర్థిక అసమానతలు రాజ్యమేలుతాయని చరిత్ర బోధిస్తున్నది. నేర చరితులే నవ నాయకులుగా అవతారమెత్తుతున్న ఉదాహరణలు మన ముందున్నాయి. అవినీతితో ప్రజాస్వామ్యం పరిహసించబడడం, ప్రభుత్వాలు అస్థిరత్వం పాలుకావడం, దేశ ప్రగతి తిరోగమన దిశగా కదలడం చూస్తున్నాం. అవినీతి, అధికార దుర్వినియోగాలు వ్యక్తి స్వేచ్ఛ, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, మానవ హక్కులు, సామాజిక న్యాయం, ప్రభుత్వ పాలన, సమాజ భవిష్యత్తులకు విఘాతంగా మారుతున్నాయి.
ప్రపంచ దేశాల్లో అవినీతిని ”కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (సిపిఐ)” ద్వారా అంచనా వేస్తున్నారు. సిపిఐ 100 ఉన్న దేశాన్ని అవినీతిరహిత దేశంగా, 0 ఉన్న దేశాన్ని అత్యంత అవినీతి కలిగిన దేశంగా వర్గీకరిస్తారు. సిపిఐ వివరాల ప్రకారం డెన్మార్క్ (సిపిఐ 88), న్యూజిలాండ్ (88), ఫిన్లాండ్ (88), సింగపూర్ (85), స్వీడన్ (85), నార్వే (85), స్విస్ (84), నెదర్లాండ్స్ (82), జర్మనీ (80)లు అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాలుగా తొలి 10 స్థానాలను దక్కించుకున్నాయి. అవినీతి అధికంగా ఉన్న దేశాలుగా ఇండియా (40), శ్రీలంక (37), నేపాల్ (33), పాకిస్తాన్ (28)లతో పాటు అత్యంత అవినీతి కలిగిన దేశాలుగా దక్షిణ సూడాన్ (సిపిఐ 11), సిరియా (13), సోమాలియా (13), వెనిజులా (14), నార్త్ కొరియా(16), ఆఫ్ఘనిస్తాన్ (16), లిబియా (17) దేశాలు జాబితాలో చివరన ఉన్నాయి. మొత్తం 180 ప్రపంచ దేశాల సిపిఐ జాబితాలో ఇండియాకు 85వ స్థానం లభించింది.
అవినీతి, లంచగొండితనం అధికంగా వ్యాపించిన భారత దేశంలో నీతివంతమైన సమాజం మాయమైపోయింది. దేశ ప్రగతి నిరోధకంగా అవినీతి చెదలు నిలుస్తున్నది. దేశం ఎదుర్కొంటున్న అధిక జనాభా, నిరుద్యోగం, అవిద్య, వాతావరణ కాలుష్యం, పేదరికం లాంటి సమస్యలకు అవినీతి కారణం అవుతున్నది. ప్రభుత్వ పథకాలు బడుగులకు చేరేసరికి బక్కచిక్కిపోతు న్నాయి. అవినీతి వ్యతిరేక చట్టాలు మూలన పడి మూలుగుతు న్నాయి. వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రి వరకు అందరికీ అవినీతి మరకలు అంటుతూనే ఉన్నాయి. చేతులు తడపందే ఫైలు కదలనంటోంది. తూకంలో మోసాలు, నకిలీ సామాన్లు, పన్ను ఎగవేతలు, కల్తీ లీలలు, ఆన్లైన్ మోసాలు లాంటివి సామాజిక ఆరోగ్యానికి పట్టిన తెగులుగా అవతరించాయి. నేడు నేర చరిత్రలే రాజకీయ నాయకుల అర్హతలు అయ్యాయి. భారత పార్లమెంటులో 50 శాతం వరకు యంపీలు నేరారోపణలు కలిగి ఉన్నారని, 40 మంది నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు నేరారోప ణలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు 4,442 కేసులను ఎదుర్కొంటున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా ఏకమవుతూ పోరుబాట పడదాం. నైతికత, పారదర్శకత, దేశభక్తి, చట్టాల పట్ల గౌరవం, జవాబుదారీతనం, అంకిత భావం పెరగాలి. నీతివంతమైన భారత నిర్మాణానికి మనందరం పూనుకుందాం, అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతినబూనుదాం.