పరిశుభ్రత

Jan 28,2024 07:13 #Editorial, #Health Awareness
hand wash good for health india editorial

శుభ్రత-ఆరోగ్యం… అందానికి రెండు కళ్ళు. దుమ్ము, ధూళి నిండిన ప్రపంచంలో పరిశుభ్రత ఒక తాజా పరిమళం. ఇది వ్యాధుల నుంచి దూరంగా వుంచుతుంది. జీవితాలను సంతోషమయం చేస్తుంది. శుభ్రత అంటే చేతులు కడుక్కోవడమో, స్నానం చేయడమొక్కటే కాదు… మన పరిసరాలను కూడా శుభ్రంగా వుంచుకోవడం. ఇది ఆరోగ్యం నిండిన ప్రపంచానికి ఒక ఆనవాలు. ‘శుభ్రత విలాసం కాదు… అవసరం. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి పరిశుభ్రత తొలిమెట్టు’ అంటాడో రచయిత. ఎంత మంచి ఆహారమైనా పరిశుభ్రంగా లేకపోతే… అనారోగ్యానికి దారితీస్తుంది. అతిసార, శ్వాసకోస వంటి వ్యాధులతో ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతున్నారు. దీనికి కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవడమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది. ఒక్క చేతులు శుభ్రపరుచుకుంటేనే… దాదాపు 50శాతం పైగా అతిసార సంబంధిత వ్యాధులు, 20 నుంచి 30 శాతం శ్వాస సంబంధిత వ్యాధులను నివారించవొచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘నీ శరీరం ఒక దేవాలయం. దానిని శుభ్రంగా వుంచుకో’ అంటారు బికెఎస్‌ అయ్యంగార్‌. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ వంటి ప్రచారాలు ఎన్ని వచ్చినా… పల్లెల నుంచి మహానగరాల వరకూ అపరిమితమైన చెత్త, ధూళి పేరుకుపోతోంది. ఇది పర్యావరణానికి హానికరంగా మారింది.

నేడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పేరుకుపోతున్న చెత్త, వ్యర్థ పదార్థాలను ప్రధానంగా చెప్పుకోవాలి. వీధులు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం ఉండడం సర్వసాధారణం. దీనివల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. వీధుల్లో చెత్త వేయడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మల మూత్ర విసర్జన చేయడం వంటివి కూడా పరిసరాల అశుభ్రతకు కారణమౌతున్నాయి. పరిశుభ్రత కేవలం భౌతిక పరిసరాలకే పరిమితం కాదు. ఇందులో వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఉంటుంది. వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి పరిశుభ్రతను పాటించడం అవసరం. ‘పరిశుభ్రత అనేది పరిపూర్ణ ప్రమాణాల యొక్క ముఖ్య లక్షణం. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణం’ అంటారు గాంధీజీ. అయితే, కంటికి కనిపించని రెండో కోణం కూడా వుంది. అదే, పారిశుధ్య కార్మికుల నిరంతర శ్రమ. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వీధులను, ఇళ్లను శుభ్రం చేసే పనిలో వారి జీవితాలను మైనంలా కరిగిస్తుంటారు. మాన్యువల్‌ స్కావెంజర్లది మరీ దయనీయమైన గాథ. గత ఐదేళ్ల కాలంలో సెప్టిక్‌ ట్యాంక్‌ల్లో పడి, మురుగు కాల్వల్లో పడి 399 మంది మాన్యువల్‌ స్కావెంజర్లు చనిపోయారని ప్రభుత్వ అధికారిక సమాచారం. ఊళ్లు, నగరాల పరిశుభ్రత కోసం వీళ్ల జీవితాలను ఫణంగా పెడుతున్నారు. అయినా లభించేది అరకొర వేతనాలే. ఇటీవల పారిశుధ్య కార్మికులు వేతనాలు పెంచాలని సమ్మె చేయాల్సి వచ్చింది. చివరకు రాష్ట్రప్రభుత్వం దిగొచ్చినా…ఏ మేరకు వారి అవసరాలు తీర్చుతారనేది చూడాల్సిందే.

పరిశుభ్రత ఆవశ్యకత, ప్రయోజనాల గురించి తెలిసినప్పటికీ, మన దేశం ఈ సమస్యతో పోరాడుతూనే ఉంది. ‘స్వచ్ఛభారత్‌’ పథకం… ప్రకటనలకే పరిమితమైంది. వీధుల్లో చెత్తాచెదారం, పొంగిపొర్లుతున్న చెత్త కుండీలు, అపరిశుభ్రంగా ఉన్న పబ్లిక్‌ టాయిలెట్లు నిత్యం కనిపించే దృశ్యం. చిన్నపాటి వర్షం వచ్చినా…రోడ్లన్నీ అశుద్ధంతో నిండుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి యేటా జనవరి 30న ‘జాతీయ పరిశుభ్రత దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా వుంచుకోవడం ప్రాథమిక కర్తవ్యంగా గుర్తు చేసేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇంటి నుంచి పని ప్రదేశం వరకు పరిసరాలను శుభ్రంగా వుంచడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారు. ‘ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముంగిలి శుభ్రంగా వుంచుకుంటే… దేశమంతా శుభ్రంగా వుంటుంది’ అంటారు మదర్‌ థెరిస్సా. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం ఇది. అందరం చేయి చేయి కలుపుదాం…మన పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చుకోడానికి కృషి చేద్దాం.

➡️