మూలస్తంభాలు – వాస్తవాలు

Feb 6,2024 07:15 #Editorial

దేశవ్యాప్త్తంగా 81 కోట్లమంది అన్నార్తులకు మరో ఐదేళ్ల పాటు ఉచితంగా తిండిగింజల పంపిణీని మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రకటించినట్టు? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బహుముఖ పేదరిక సూచీలో మన దేశం పొరుగునున్న బంగ్లాదేశ్‌, శ్రీలంక కన్నా దిగువనే ఉంటున్నదని వారు ఆందోళన పడుతున్నారు. దేశంలో దాదాపు 23 కోట్ల మంది కటిక పేదరికంలో జీవిస్తున్నారని, వారిలో 15 కోట్ల మందికి పైగా ప్రజానీకానికి నూరు రోజుల పని (ఉపాధి హామీ పథకం) మాత్రమే దిక్కు అని తెలిపారు.

                 పేదలు, రైతులు, మహిళలు, యువత-ఈ నాలుగు మూలస్తంభాలపైనే మన భారతదేశం విరాజిల్లుతున్నదని కేంద్రంలోని మోడీ ప్రభుత్వ మాటలుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు వేదికగా ఉటంకించారు. తద్వారా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. పార్లమెంటు నూతన భవనంలో ఉభయ సభలనుద్దేశించి 75 నిముషాల పాటు సాగిన రాష్ట్రపతి ప్రసంగానికి పాలకపక్షం పలుమార్లు పదే పదే హర్షధ్వానాలు ప్రకటించడంలో వింతేమీ ఉండదు. అయోధ్య రామాలయంలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన గురించి ప్రస్తావించినప్పుడయితే బల్లలు చరిచి మరీ కేరింతలు కొట్టడం బహిరంగసభను తలపించింది. అయితే భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక గురించి కాకుండా కేవలం గత పదేళ్ల ప్రభుత్వ పనికే రాష్ట్రపతి పరిమితి కావడం గమనర్హం.

న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు మూలస్తంభాలుగా మనం భారత రాజ్యాంగాన్ని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సారథ్యంలో రూపొందించుకున్నాము. మన దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకున్నాము. 75 ఏళ్ల అమృతోత్సవ వేడుకల వేళ, ఈ మూలస్తంభాల ప్రస్తావన ఎలా మారుతున్నదీ (అదీ పార్లమెంటు వేదికగా) మనం గమనించవచ్చు. కాగా, ఈ తొమ్మిదేళ్ల వ్యవధిలో పాతిక కోట్ల మంది పేదలు (మొదటి స్తంభం) దారిద్య్రరేఖ ఊబి నుండి బయటపడినట్టు నీతి ఆయోగ్‌ చర్చా పత్రం చెబుతున్నది. 2013-14లో 29.7 శాతంగా నమోదైన పేదరికం 2022-23 నాటికి 11.28 శాతానికి తగ్గినట్టు అది పేర్కొంది. 2030 నాటికల్లా ఆకలి బాధకు తాళలేని, తావులేని సుందర ప్రపంచాన్ని సృష్టించాలనే ఐ.రా.స సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగానే భారత్‌ వడివడిగా అడుగులు వేస్తున్నట్టు వివరించింది.

మరైతే దేశవ్యాప్త్తంగా 81 కోట్లమంది అన్నార్తులకు మరో ఐదేళ్ల పాటు ఉచితంగా తిండిగింజల పంపిణీని మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రకటించినట్టు? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బహుముఖ పేదరిక సూచీలో మన దేశం పొరుగునున్న బంగ్లాదేశ్‌, శ్రీలంక కన్నా దిగువనే ఉంటున్నదని వారు ఆందోళన పడుతున్నారు. దేశంలో దాదాపు 23 కోట్ల మంది కటిక పేదరికంలో జీవిస్తున్నారని, వారిలో 15 కోట్ల మందికి పైగా ప్రజానీకానికి నూరు రోజుల పని (ఉపాధి హామీ పథకం) మాత్రమే దిక్కు అని తెలిపారు. వ్యవసాయ కూలీలు, రోడ్డు మీద రోజువారీ అడ్డా కూలీలు, పేవ్‌మెంట్‌ వెండర్స్‌ (చిన్న చిన్న విక్రయదారులు), పని మనుషులు, ఒంటరి మహిళలు, నిరాధార వృద్ధులు, పండ్లు, కూరగాయలు అమ్ముకునే వాళ్లు, చేతివృత్తుల వాళ్లు, సఫాయి కార్మికులు, గనులు, సున్నపు రాయి, కంకర, గ్రానైట్‌ వంటి ప్రమాదకర రాళ్ల పనివాళ్లు, నిర్మాణ కార్మికులు, మృతకళేబరాల చర్మాలను శుభ్రపరిచేవారు, చెత్తా చెదారం ఏరుకునేవారు, సముద్రం-నదులు జలాల మధ్య పనిచేసుకునే మత్స్య కారులు, అటవీ ఉత్పత్తులు సేకరించుకునే గిరిజనులు-ఇలా ఎంతో మంది పేదలు నిత్య జీవితంలో మనకు తారసపడుతూనే ఉంటారు. విషయం ఏమంటే మన దేశంలో సంపన్నులు ఏడు శాతం మంది మాత్రమే ఉంటే మిగిలిన 93 శాతం మంది మధ్యతరగతి, పేదవారన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆర్థిక నిపుణులు వక్కాణిస్తున్నారు.

ఇక రైతులు (రెండవ స్తంభం) విషయానికొస్తే మనం ఒకటి కచ్చితంగా చెప్పుకోవాలి. ఈసారి గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ అతిథిóగా హాజరయ్యారు. ప్రపంచ వ్యూహాత్మక రాజకీయాల్లో అనుసరించే ఆయుధ సైనిక పాటవాల్లో భాగంగా ఈ పర్యటనను భావించాలని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌-ఫ్రాన్స్‌ ఉభయ దేశాల మధ్య జరుగుతున్న ఒప్పందాలు ఆత్మనిర్భర్‌ భారత్‌కే కాకుండా మేక్‌ ఇన్‌ ఇండియాకు కూడా ఉపకరిస్తుందని గోడీ మీడియా ప్రగల్భాలు పలుకుతున్నది. ఎందుకంటే రాఫెల్‌ యుద్ధ విమానాల తయారీ, ఇంజన్ల విడిభాగాల నిర్వహణ- మరమ్మతు వంటి అంశాలు కూడా ఇందులో కీలకం మరి. అయితే మన దేశంలో మాదిరి ఫ్రాన్స్‌ రైతులు కూడా తమ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపౖౖె పోరాడుతున్నారు. ఇదో సారూప్యత. ఎంత దాచిపెట్టినా ఈ వార్తలు బయటకు పొక్కుతూనే ఉన్నాయి. ఇటీవల ఇద్దరు మహిళా ఉద్యమకారులు తమ నిరసనగా పారిస్‌ మ్యూజియంలోని మోనాలిసా పెయింటింగ్‌పై సూప్‌ విరజిమ్మారు. సుస్థిరమైన ప్రజారోగ్యానికి కావాల్సింది ఆహార భద్రతా? కళాఖండాలా? ఏది ముఖ్యం? అని ప్రశ్నించారు. ‘మన దేశ (ఫ్రాన్స్‌) వ్యవసాయ రంగం పెను సంక్షోభంలో చిక్కుకున్నది. రైతులు చనిపోతూనే ఉన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలి’ అని వారు ఆ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఇంధన ధరలు మోయలేని విధంగా పెరిగాయంటూ రైతులు ట్రాక్టర్లతో పారిస్‌ నగరాన్ని దిగ్బంధించారు. ఇది రాజధాని ఢిల్లీలో ఏడాదిన్నర పాటు సాగిన మన కిసాన్‌ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తున్నది. 700 మందికి పైగా రైతులు ఆ ఉద్యమంలో బలైపోయిన విషయం తెలిసిందే. నల్లచట్టాల రద్దు విషయంలో అప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చనపుడు ఇక మోడీ ప్రభుత్వాన్ని నమ్మేదెలా? భారత రైతుల ఆక్రోశం ఇది.

మరి మహిళలు (మూడవ స్తంభం) విషయానికి వస్తే బిల్కిస్‌ బానో ఉదంతం ఒక్కటి చాలు. 2002 గుజరాత్‌ నరమేధం ఘటనలో అరాచక ఉన్మాద మూకలు గర్భవతి బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేశాయి. మూడేళ్ల కుమార్తెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురిని ఆ మూకలు అమానుషంగా హత్య చేశాయి. ఈ దుర్మార్గంపై బిల్కిస్‌బానో ఒంటరిగా సుదీర్ఘ కాలం పాటు న్యాయ పోరాటం చేసింది. ఎట్టకేలకు ముంబై హైకోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008 జనవరిలో ఈ తీర్పు వచ్చింది. కానీ ప్రధాని మోడీ 2022 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎర్రకోటపై నుండి భారత నారీశక్తికి దేశమంతా గర్వించాలని ఉద్ఘాటించిన కొద్దిసేపటికే గుజరాత్‌ ప్రభుత్వం, మిగతా శిక్షాకాలం రద్దు చేసి ఆ నేరస్తులను రెమిషన్‌పై విడుదల చేసింది. విడుదలైన వారిలో ఏ ఒక్కరూ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు సరికదా, వారిలో కొందరిని వారి అనుచరులు మేళతాళాలతో ఊరేగించారు. దాంతో బిల్కిస్‌ బానో తిరిగి పోరాటం చేయాల్సి వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం గత నెల 8వ తేదీన విస్పష్టమైన తీర్పు ఇస్తూ…ఆ పదకొండుమంది నేరస్తులు వెంటనే లొంగిపోయి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ప్రస్తుతం కొందరు పరారీలో ఉన్నట్టు తెలుస్తున్నది. ‘నేను మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా బిల్కిస్‌ బానో పలికిన మాటలు నారీ, ధర్మ పక్షపాతుల గుండెల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. చివరగా (నాల్గవ స్తంభం) యువత. ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన (141 కోట్లు) భారతదేశంలో ముప్పై ఏళ్లలోపు ఉన్న యువ-బాలలు 60 శాతం మంది. అందులో సగం 16-30 ఏళ్లు కలిగిగన యువత ఉన్నారనుకుంటే, వారి సంఖ్య 42 కోట్లు. అందుకే మన దేశాన్ని యంగ్‌ ఇండియా (యువ భారత్‌)గా పిలుస్తున్నారు. నిజమే-కానీ యువతను దేశ నిర్మాణ పథంవైపు నడిపించే ప్రణాళికలేవీ పాలకుల దగ్గర లేవు. నేడు కార్పోరేట్‌ ప్రపంచీకరణ పడగనీడన ఎల్లెడలా ఉపాధి రహిత అభివృద్ధే వ్యాపిస్తున్నది. అది పర్యావరణాన్ని, సహజ వనరులను, మానవ వనరులను విధ్వంసం చేసే దిశగానే సాగుతున్నది. ఈ నేపథ్యంలో యువతను నిర్వీర్యం గావించేందుకే పెద్ద ఎత్తున కుట్రలు సాగుతున్నాయనడం సత్య దూరం కాదు. యంగ్‌ ఇండియాను డ్రగ్‌ ఇండియాలా మార్చేలా గ్రామాలకు సైతం మత్తు-మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్నాయి. మరో పక్క సెల్‌ఫోన్లలో ఆవరించిన బూతు చిత్రాలు యువతను విషతుల్యం చేస్తున్నాయి. వారు హింసా ఉన్మాద చర్యలకు పాల్పడేందుకు తోడ్పడుతున్నాయి. నిరుద్యోగం సరేసరి. మన దేశ నిరుద్యోగ రేటు 2023 జులై నాటికి 7.95 శాతానికి చేరుకున్నది. నిరుద్యోగ యువ మేధ అనివార్యంగా వెరిత్రలలు వేస్తుందని మానసిక నిపుణుల అభిప్రాయం. ఇవన్నీ కళ్ల ముందు జరుగుతున్న కఠోర వాస్తవాలు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు పాలకులు భావిస్తే ఏం చేప్పలేం. మరి ఏ శాస్త్రీయ చర్యలతో ఈ మూలస్తంబాలను ఉద్ధరిస్తారో పాలకులే చెప్పాలి.

/ వ్యాసకర్త సెల్‌ : 9959745723 / – కె.శాంతారావు

➡️