మూడవ ఏడాదిలో ఉక్రెయిన్‌ సంక్షోభం !

Feb 21,2024 07:20 #Editorial

ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఏ పక్షమూ గెలిచే లేదా ఓడిపోయే స్థితి లేదని మరికొంత కాలం కొనసాగుతుదంటున్నవారు కొందరు. గత ఏడాది ఆర్భాటం చేసి ప్రారంభించిన ఎదురుదాడిలో మొత్తంగా చూసినపుడు ఉక్రెయిన్‌కు మరిన్ని నష్టాలు, కొత్త ప్రాంతాలను కోల్పోవటం, ఆత్మరక్షణలో భారీ సంఖ్యలో ప్రాణాలను బలిపెడుతున్నది. మరోవైపు రష్యా కూడా ప్రాణాలను పెద్ద సంఖ్యలో కోల్పోవటంతో పాటు యుద్ధ సామగ్రిని కూడా భారీగా నష్టపోతున్నది. ఉక్రెయిన్‌ లొంగుబాటు తప్ప మరే చర్చలూ లేవని పుతిన్‌ తెగేసి చెప్పాడు. పదేళ్ల నాడు కోల్పోయిన క్రిమియాతో సహా అన్ని ప్రాంతాలను తిరిగి తమకు అప్పగిస్తే తప్ప రాజీ లేదని జెలెన్‌స్కీ చెప్పటం, ఈ ఏడాది అమెరికా ఎన్నికలు ఉన్నందున ఏడాది పొడవునా పోరు కొనసాగవచ్చు.

క్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య మూడవ ఏడాదిలోకి ప్రవేశించింది. 2022 ఫిబ్రవరి 24న దాడులు ప్రారంభమైనప్పటికీ 21వ తేదీనే వ్లదిమిర్‌ పుతిన్‌ అధికారికంగా ఆదేశాలు జారీ చేశాడు. ఉక్రెయిన్‌ సరిహద్దుల వైపు రష్యా దళాల అసాధారణ కదలిక ఉన్నట్లు 2021 నవంబరు పదవ తేదీన అమెరికా వెల్లడించింది. ఒకవేళ దాడికి దిగితే బలమైన ఆర్థిక, ఇతర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డిసెంబరు ఏడున అమెరికా అధినేత జో బైడెన్‌ బెదిరించాడు. నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరకుండా నిషేధం విధించాలని పుతిన్‌ డిసెంబరు 17న ప్రతిపాదించాడు. దాన్ని జెలెన్‌స్కీ తిరస్కరించాడు. జనవరి 17న తన మిత్ర దేశమైన బెలారస్‌తో సైనిక విన్యాసాలు జరిపేందుకు రష్యా ఆరు వేల మంది సైనికులు, 60 జెట్‌ విమానాలను పంపింది. తన దళాలను సన్నద్ధం చేసినట్లు జనవరి 24న నాటో ప్రకటించింది. ఫిబ్రవరి 10న పది రోజుల పాటు సాగే మిలిటరీ విన్యాసాలు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా, ఉక్రెయిన్‌ సరిహద్దులో ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు తూర్పు ప్రాంతాలపై ఫిబ్రవరి 17న ఉక్రెయిన్‌ మిలిటరీ విరుచుకుపడింది. అదే నెల 21న పుతిన్‌ సైనిక చర్యకు ఉత్తర్వులు ఇవ్వటంతో పాటు రెండు ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలు డాటెస్క్‌, లుహాన్స్క్‌లకు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు ఇస్తున్నట్లు కూడా ప్రకటించాడు. 24వ తేదీన దాడులు ప్రారంభమయ్యాయి.

రెండు సంవత్సరాల ఈ సంక్షోభాన్ని స్థూలంగా చూసినపుడు ఉక్రెయిన్‌పై రష్యా పట్టు మరింత బిగిసింది. భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చిన పశ్చిమ దేశాలు ప్రచారం చేసిన మాదిరి ఉక్రెయిన్‌ ఎదురు దాడులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. రెండు వైపులా ఎందరు మరణించిందీ ఇంతవరకు విశ్వసనీయమైన ఆధారాలు లేవు. లక్షల్లో ప్రాణ నష్టం ఉంటుందని భావిస్తున్నారు. రష్యా మీద ప్రకటించిన ఆర్థిక, ఇతర ఆంక్షలు దేనికీ కొరగాకుండా పోయాయి. ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. అటు అమెరికా, ఇటు రష్యాలోనూ ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన అంశంగా మారనుంది. దీంతో రెండింటికీ ఈ సంక్షోభం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సంక్షోభానికి ఎప్పుడు, ఎలా తెరపడుతుంది అన్న చర్చ జరుగుతున్నది.

తాజా పరిణామాలను చూద్దాం. తూర్పు ఉక్రెయిన్‌లోని అడీవికా ప్రాంతాన్ని రష్యన్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జన నష్టాన్ని నివారించేందుకు తామే ఖాళీ చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. గత ఏడాది మే నెల తరువాత రష్యన్లకు ఇది పెద్ద విజయంగా చెబుతున్నారు. తగిన సంఖ్యలో మిలిటరీ ఉన్నా వారి దగ్గర మందుగుండు లేకనే ఇది జరిగిందని వార్తలు. అడీవికా పతనం కాగానే తమ వద్ద ఉన్న శతఘ్నులను మొత్తం ఇస్తామని డెన్మార్క్‌ ప్రకటించింది. మీరు ఇచ్చినా వాటిని వెంటనే వినియోగించే స్థితిలో లేమని ఉక్రెయిన్‌ చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా రష్యా మరిన్ని దాడులకు పూనుకుంది. మ్యూనిచ్‌ నగరంలో జరుగుతున్న భద్రతా సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ ‘దయచేసి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని మమ్మల్ని అడగకండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పుతిన్‌ ఇప్పటికీ కొనసాగించటానికి ఎలా వీలవుతున్నదో చూడండి’ అని ఐరోపా సమాఖ్యతో అన్నాడు. ఈ సంక్షోభంలో తాము తటస్థంగా ఉన్నామని చైనా మరోసారి స్పష్టం చేసింది. ఐరోపాకు రష్యా ముప్పు కొనసాగుతూనే ఉందని, అది కొన్ని నెలలు, సంవత్సరాలు, ఒక తరం వరకు ఉండవచ్చని బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేత డేవిడ్‌ లామీ అన్నాడు. ఉక్రెయిన్‌ ఇప్పుడు జీవన్మరణ స్థితిలో ఉందని, దాని భవితను నిర్ణయించేది తామేనని పుతిన్‌ ప్రకటించాడు. మరో పద్దెనిమిది నెలల పాటు ఉక్రెయిన్‌ పౌరులకు వీసాలను పొడిగిస్తున్నట్లు బ్రిటన్‌ తెలిపింది. దీన్నిబట్టి పశ్చిమ దేశాలకు ఈ సమస్య పరిష్కారం పట్ల ఆసక్తి లేదన్నది స్పష్టమౌతోంది.

రెండు సంవత్సరాల తరువాత రష్యాను శత్రు దేశంగా చూస్తున్నప్పటికీ ఐరోపాలో యుద్ధ ఆయాసం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌కు రానున్న రోజుల్లో విజయాలు సంభవిస్తే ఫరవాలేదు. లేకుంటే మరింత నీరసం, దాన్నుంచి ఎందుకీ తలనొప్పి అనే భావం కూడా తలెత్తవచ్చు. మొత్తం మీద ఎన్ని మల్లగుల్లాలు పడినా నాటో కూటమి ఐక్యంగానే ఉంది. ఫిన్లండ్‌ కొత్తగా చేరగా స్వీడన్‌ ఆ బాటలో ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా గెలిస్తే అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థ వైపు తిరిగే మలుపు పశ్చిమ దేశాల ప్రయోజనాల ఫణంగా జరుగుతుందని భావిస్తున్నారు. బాల్టిక్‌ దేశాలు ఉక్రెయిన్‌కు గట్టి మద్దతు ఇవ్వాలని కోరుతుండగా నాటోలోని హంగేరి, స్లోవేకియా పెదవి విరుస్తున్నాయి. నెదర్లాండ్స్‌, స్లోవేకియాలో గతేడాది జరిగిన ఎన్నికలు నాటో ఐక్యత మీద ప్రశ్నలను ముందుకు తెచ్చాయి. ఉక్రెయిన్‌కు యాభై నాలుగు బిలియన్‌ డాలర్ల అదనపు సాయం అందించాలన్న ప్రతిపాదనను అడ్డుకొనేందుకు హంగేరీ ప్రయత్నించింది. ఇప్పటి వరకు చూస్తే జెలెన్‌స్కీ దళాలకు తాము ఇచ్చిన ఆధునిక ఆయుధాలను ఉపయోగించటంలో నాటో దేశాలు శిక్షణ ఇస్తున్నాయి తప్ప ముందే చెప్పినట్లు ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు. అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు, రష్యాను ఒంటరి చేసేందుకు వీలైనదంతా చేస్తున్నాయి.

నాటో దేశాలు పైకి బింకంగా కనిపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో వాటికి తోచటం లేదు. నష్టదాయకమైన షరతులతో రష్యాతో రాజీకి అంగీకరించటమా లేక పోరును పొడిగించి ఓటమిని మూటగట్టుకోవటమో ఏదో ఒకటి జరుగుతుందని అనేక మంది నమ్ముతున్నారు. ఏది జరిగినా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, దాని మిత్ర దేశాలకు ప్రతికూలత మరింత పెరుగుతుంది.

కొందరు కొరియా నమూనాలో పోరు ముగియవచ్చని చెబుతున్నారు. 1950 దశకంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఒకే దేశంగా ఉండాల్సిన కొరియా రెండు భూభాగాలుగా ఉంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ ఒప్పందం ఇప్పటికీ లేదు. దక్షిణ కొరియా రక్షణకు హామీ ఉన్నట్లుగా ఉక్రెయిన్‌కు నాటో రక్షణ హామీని రష్యా ఎట్టి పరిస్థితిలో అంగీకరించదు గనుక అది కూడా జరగకపోవచ్చన్నది మరొక వాదన. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలైన తరువాత చైనా-రష్యా సంబంధాలు మరింత బలపడటమే గాక రెండూ దగ్గరయ్యాయి. అంటే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మాదిరి రెండు శిబిరాలుగా ప్రపంచం చీలిందని సూత్రీకరించేవారు కూడా లేకపోలేదు. తటస్థంగా ఉన్నా, ఆయుధాలను సరఫరా చేయకున్నా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం నుంచి తప్పించేందుకు చైనా ఇటీవలి కాలంలో రష్యా నుంచి తన దిగుమతులను పెంచుకొన్నది. ఈ పరిణామంతో అట్లాంటిక్‌ ప్రాంత దేశాలు వీటికి వ్యతిరేకంగా దగ్గర అవుతున్నాయి. రక్షణ బడ్జెట్లను, మిలిటరీని పెంచుతున్నాయి. గత ప్రచ్ఛన్న యుద్ధానికి ఇప్పటిదానికి చాలా తేడా ఉన్నది. సోవియట్‌-చైనా బంధం కంటే ఇప్పుడు చైనా-రష్యా బంధం ఎంతో ప్రాధాన్యత కలిగింది. నాడు చైనా ఆర్థికంగా మిలిటరీ రీత్యా నేటి మాదిరి బలంగా లేదు. గతంలో సోవియట్‌-చైనా మధ్య ఉన్న విబేధాలను అమెరికా వినియోగించుకుంది, ఇప్పుడు అలాంటి అవకాశం లేదు.

ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఏ పక్షమూ గెలిచే లేదా ఓడిపోయే స్థితి లేదని మరికొంత కాలం కొనసాగుతుదంటున్నవారు కొందరు. గత ఏడాది ఆర్భాటం చేసి ప్రారంభించిన ఎదురుదాడిలో మొత్తంగా చూసినపుడు ఉక్రెయిన్‌కు మరిన్ని నష్టాలు, కొత్త ప్రాంతాలను కోల్పోవటం, ఆత్మరక్షణలో భారీ సంఖ్యలో ప్రాణాలను బలిపెడుతున్నది. మరోవైపు రష్యా కూడా ప్రాణాలను పెద్ద సంఖ్యలో కోల్పోవటంతో పాటు యుద్ధ సామగ్రిని కూడా భారీగా నష్టపోతున్నది. రానున్న ఎన్నికల కారణంగా పెద్ద సంఖ్యలో మిలిటరీ రిక్రూట్‌మెంట్లు కూడా చేసే పరిస్థితి లేదు. జనాభా రీత్యా తక్కువ సంఖ్య ఉన్న ఉక్రెయిన్‌కు ఇంకా కష్టం. పశ్చిమ దేశాలు ఊహించినదానికి భిన్నంగా పుతిన్‌ తనకు కావాల్సిన ఫిరంగి గుండ్లు తదితరాలను ఇరాన్‌, ఉత్తర కొరియా నుంచి పొందుతున్నాడు. ఉక్రెయిన్‌కు నాటో సరఫరాలు సరేసరి. ఉక్రెయిన్‌ లొంగుబాటు తప్ప మరే చర్చలూ లేవని పుతిన్‌ తెగేసి చెప్పాడు. పదేళ్ల నాడు కోల్పోయిన క్రిమియాతో సహా అన్ని ప్రాంతాలను తిరిగి తమకు అప్పగిస్తే తప్ప రాజీ లేదని జెలెన్‌స్కీ చెప్పటం, ఈ ఏడాది అమెరికా ఎన్నికలు ఉన్నందున ఏడాది పొడవునా పోరు కొనసాగవచ్చు.

ఎం.కోటేశ్వరరావు
ఎం.కోటేశ్వరరావు
➡️