ఆటవిక దశ వైపుగా పతనం

Feb 20,2024 07:13 #Editorial

ఫాసిస్టు ప్రమాదం గురించి 1915లో రోజా లక్సెంబర్గ్‌ హెచ్చరించినప్పుడు ఏవిధంగా సోషల్‌ డెమోక్రాట్లు పట్టించుకోకుండా తమ దేశాల పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు సహకరించాయో, ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఒకపక్క ఆ పెట్టుబడిదారీ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజానీకం రోడ్లమీదకు వచ్చి ఇజ్రాయిల్‌ దురాగతాలను ఖండిస్తున్నాయి. కాని ఆ పెట్టుబడిదారీ దేశాల్లో వివిధ రాజకీయ పార్టీలు-అటు పచ్చి మితవాద పార్టీల నుండి ఇటు సోషల్‌ డెమోక్రాట్ల వరకూ, గ్రీన్స్‌ పార్టీతో సహా, సోషల్‌ డెమోక్రాట్లలోని వామపక్షవాద పార్టీలతో సహా (ఉదా: జర్మనీలోని డై లింక్‌ పార్టీ) సామ్రాజ్యవాదం వెనుక బారులు తీరాయి. ఇజ్రాయిల్‌ని, దాని సెట్లర్‌ వలసవాదాన్ని సమర్ధిస్తున్నాయి.

రోజా లక్సెంబర్గ్‌ 1915లో జైలు నుండి ‘ది జునియస్‌ పాంప్లెట్‌’ అన్న రచన చేశారు. అందులో మానవాళి ముందు ఎంచుకోడానికి రెండే రెండు దారులు ఉన్నాయని, ఒకటి సోషలిజం వైపుకు, రెండవది ఆటవిక దశ వైపుకు తీసుకుపోతుందని అన్నారు. దీనిని ఉదారవాద బూర్జువాలు అంగీకరించరు. ఆటవిక దశ రెండు ప్రపంచ యుద్ధాలలో వ్యక్తమైందని, ఆ రెండు యుద్ధాలకు, పెట్టుబడిదారీ విధానానికి సంబంధం లేదని వారంటారు. ఆ కాలంలో బూర్జువా ఉదారవాదమే బలంగా ముందుకొచ్చి ఆ కాలపు ఆటవికతను ఎదిరించి పోరాడిందని అంటారు. మానవ విలువలను అంతకు మునుపెన్నడూ చేరుకోనంత అత్యున్నత విలువలకు చేర్చింది పెట్టుబడిదారీ విధానమేనని వారు బలంగా చెప్తారు. దానికి యుద్ధానంతర కాలపు పరిణామాలే ఉదాహరణలు అని అంటారు.

పెట్టుబడిదారీ విధానంలో మానవత్వ విలువలు ముందుండడం అని చెప్పడం అంటే, అది మన ముందు దర్శనమిచ్చే సామ్రాజ్యవాదం అన్నదానిని గుర్తించకపోవడమే. భారతదేశంలో బ్రిటిష్‌ పాలనలో రుద్దిన కరువుల గురించి అందరికీ తెలిసినదే. బ్రిటిష్‌ వలస పాలన 1770లో బెంగాల్‌లో తలెత్తిన కరువుతో మొదలైంది. అందులో ఒక కోటి మంది మరణించారు. ఆనాటికి బెంగాల్‌ ప్రావిన్స్‌లో ఉన్న మొత్తం జనాభా 3 కోట్లు. వారిలో మూడవ వంతు మరణించారు. భూములపై బ్రిటిష్‌ వారు వసూలు చేసిన పన్నుల భారం అంత ఎక్కువగా ఉండింది. ఈ బ్రిటిష్‌ పాలన ముగుస్తుంద నగా 1943లో మళ్ళీ కరువు వచ్చింది. ఈ కరువుకు కారణం యుద్ధ ఖర్చుల నిమిత్తం బ్రిటిష్‌ ప్రభుత్వం మన మీద మోపిన అదనపు భారాలు. ఈ కరువులో ఇంకో 30 లక్షల మంది మరణించారు. ప్రస్తుతం నమీబియాగా పిలువబడుతున్న ఆఫ్రికన్‌ ప్రాంతంలో ఆనాటి జర్మన్ల పాలన సాగింది. పెద్ద సంఖ్యలో స్థానిక గిరిజన తెగల ప్రజలను నిర్బంధించి అంతం చేయడానికి అక్కడ డెత్‌ క్యాంప్‌లు నిర్మించారు. ఆ నమూ నాయే తర్వాత 1930 దశకంలో హిట్లర్‌కు కాన్‌సెంట్రేషన్‌ క్యాంప్‌లు నిర్మించడానికి ప్రేరణ అయింది. కాంగోలో బెల్జియన్‌ ప్రభుత్వం లియోపాల్డ్‌ నేతృత్వంలో మానవులను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన క్రూరాతి క్రూరమైన ఉదంతాలు ప్రపంచానికంతటికీ తెలిసినవే. యూరోపియన్‌ దేశాల నుండి ఉష్ణ మండల దేశాలకు వలసలు వచ్చినవారు అక్కడ ఉండే స్థానిక ప్రజానీకాన్ని మూకుమ్మడిగా భారీ స్థాయిలో నిర్మూలించడం, తక్కినవారిని కొద్దిపాటి భూభాగాలకు పరిమితం చేయడం, వారి భూములను, నివాసాలను స్వాధీనం చేసుకోవడం కూడా అందరికీ తెలుసు. ఈ మాదిరి క్రూర సంఘటనలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే, ఆ క్రూరత్వానికి ప్రేరణ కేవలం సంపదను చేజిక్కించుకోవాలన్న ఆకాంక్ష మాత్రమే. ఇది పెట్టుబడిదారీ విధానపు ముఖ్య స్వభావం.

యుద్ధాలు, ఆక్రమణలు, కొల్లగొట్టడాలు పెట్టుబడిదారీ విధానం రాకముందు నుంచీ ఉన్నవే కదా, కాబట్టి వాటిని పెట్టుబడిదారీ విధానంతో ముడిపెట్టడం ఎందుకు? అని కొందరు వాదిస్తారు. అంతకు మునుపు జరిగిన కొల్లగొట్టడాలలో, దాడులలో, బాధితుల వద్ద ఇంకా ఎంతో కొంత మిగిల్చారు. లేదా, ఆ బాధితులు మళ్ళీ కోలుకునేందుకు అవకాశాలు ఉండేవి (అలా కోలుకున్న తర్వాత మళ్ళీ దాడులు జరిగేవి). కాని పెట్టుబడిదారీ విధానంలో దోపిడీకి గురైనవారి నుండి సమస్తమూ శాశ్వతంగా లాక్కున్నారు.

రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత కాలంలో పెట్టుబడ ిదారీ విధానం తానెంతో మానవత్వం కలిగిన వ్యవస్థగా చూపించుకొనేందుకు ప్రయత్నించింది. ఆటవికతను ఎదిరించి పోరాడేది తానేనని చెప్పుకోడానికి పూనుకుంది. తమ హాలీవుడ్‌ చిత్రాల ద్వారా రెండో ప్రపంచ యుద్ధం పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యానికి, ఫాసిజానికి మధ్య జరిగినట్టు చిత్రించింది. ఫాసిజాన్ని ఓడించడంలో, ఆ యుద్ధాన్ని ముగించడంలో సోవియట్‌ యూనియన్‌ నిర్వహించిన కీలక పాత్రను తక్కువచేసి చూపింది. యుద్ధం ముగిసిన తొలి సంవత్సరాలలో సోవియట్‌ యూనియన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన సంఘీభావం, సానుభూతి క్రమంగా కరిగిపోయేలా ఈ ప్రచారం చేసింది. ప్రజలు అంతకు ముందెన్నడూ చూడని గొప్ప మానవత్వ ప్రపంచంలో జీవిస్తున్నట్టు భ్రమలు కల్పించింది. రోజా లక్సెంబర్గ్‌ వ్యాఖ్య ఇప్పుడు ప్రపంచానికి ఏ మాత్రమూ వర్తించదని నిరూపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కాలంలో జరిగిన వియత్నాం యుద్ధం గాని, సిఐఎ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్రభుత్వాలను కూలదోయడం, నియంతలను గద్దెనెక్కించడం వంటి కుట్రలు గాని ప్రజానీకం విస్మరించేలా ప్రచారం నిర్వహించింది. వాటన్నింటినీ ఉగ్రవాదుల కార్యకలాపాలుగా కొట్టిపారేసింది. ఐతే ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం మానవీయమైనదన్న భ్రమ తొలగిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ క్రూరత్వం, ఆటవిక స్వభావం మునుపెన్నడూ లేనంతగా బైటపడుతోంది. గుండెలవిసిపోయేలాంటి తన క్రూరత్వం పాలస్తీనా ప్రజలపై సాగుతున్న మారణహోమంలో మనకు కనిపిస్తోంది. ఇప్పటికి సుమారు 28,000 మంది ప్రజలు హతులయ్యారు. వారిలో 70 శాతం మహిళలు, చిన్న పిల్లలు. లక్ష మందికి పైగా ప్రజలు కనిపించడం లేదు. వారిలో చాలామంది మరణించి వుంటారని భావిస్తున్నారు. అంటే ఈ మారణహోమంలో మృతుల సంఖ్య 28,000 కన్నా చాలా ఎక్కువే. చాలామందిని బాంబులు కురిపించి ఇళ్ళు వదిలి పోయేలా చేశారు. బాధితులకు ఐరాస ద్వారా చేపట్టిన సహాయక చర్యలను పెట్టుబడిదారీ ప్రభుత్వాలు అడ్డుకు న్నాయి. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో సాగుతున్నది 21వ శతాబ్దంలోకెల్లా అత్యంత దారుణమైన దమనకాండ అని ఐరాసకు చెందిన ఆర్థిక సామాజిక కమిషన్‌ పేర్కొంది. ఇజ్రాయిల్‌ లోని జియోనిస్టుల ద్వారా అత్యంత అమానవీయమైన మానవ హననం ఇప్పుడు పశ్చిమ ఆసియాలో సాగుతోంది. దానికి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు ఊతం ఇస్తున్నాయి.

ఇజ్రాయిల్‌ ప్రభుత్వ దురహంకారం ఎంత ముదిరిపోయిందంటే అది తమపై అంతర్జాతీయ కోర్టులో ఫిర్యాదు చేసిన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిని, ఆమె కుటుంబ సభ్యులను ”తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందంటూ” బహిరంగంగా హెచ్చరించింది. అంతర్జాతీయ కోర్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ వాదనలు సహేతుకమని తీర్పునిచ్చింది. ఎటువంటి జాతి నిర్మూలనకూ పాల్పడరాదంటూ ఇజ్రాయిల్‌ను ఆ కోర్టు ఆదేశించింది. గాజాలో సాగుతున్న యుద్ధాన్ని వెంటనే నిలుపు చేయాలన్న ఒక్క మాట తప్ప తక్కినదంతా చెప్పింది. ఇంత జరిగాక కూడా పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాలు ఇజ్రాయిల్‌నే బలపరుస్తున్నాయి. అంతర్జాతీయ కోర్టు తీర్పు అర్ధం లేనిదంటూ అమెరికా కొట్టిపారేసింది. ఇజ్రాయిల్‌ జాతి నిర్మూలనకు పాల్పడుతోందని ఆరోపణ చేయడం అంటే నైతికంగా హద్దులు దాటి వ్యవహరించడమేనని ఫ్రాన్స్‌, జర్మనీ వాదిస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసినది ఒకటుంది. ఫాసిస్టు ప్రమాదం గురించి 1915లో రోజా లక్సెంబర్గ్‌ హెచ్చరించినప్పుడు ఏవిధంగా సోషల్‌ డెమోక్రాట్లు పట్టించుకోకుండా తమ దేశాల పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు సహకరించాయో, ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఒకపక్క ఆ పెట్టుబడిదారీ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజానీకం రోడ్లమీదకు వచ్చి ఇజ్రాయిల్‌ దురాగతాలను ఖండిస్తున్నాయి. కాని ఆ పెట్టుబడిదారీ దేశాల్లో వివిధ రాజకీయ పార్టీలు-అటు పచ్చి మితవాద పార్టీల నుండి ఇటు సోషల్‌ డెమోక్రాట్ల వరకూ, గ్రీన్స్‌ పార్టీతో సహా, సోషల్‌ డెమోక్రాట్లలోని వామపక్షవాద పార్టీలతో సహా (ఉదా: జర్మనీలోని డై లింక్‌ పార్టీ) సామ్రాజ్యవాదం వెనుక బారులు తీరాయి. ఇజ్రాయిల్‌ని, దాని సెట్లర్‌ వలసవాదాన్ని సమర్ధిస్తున్నాయి.

ప్రపంచ ప్రజానీకం అంతా ఈ ఆటవికతను అసహ్యించుకుంటున్నారు. ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలలో మరీ ఎక్కువగా ఇజ్రాయిల్‌ ఆటవికతను ఖండిస్తున్నారు. ఐనప్పటికీ, సామ్రాజ్యవాదం ఇంత బాహాటంగా అదే ఆటవికతను సమర్ధించే ధైర్యాన్ని ఎలా ప్రదర్శిస్తోంది? అన్నది ఇక్కడ తక్షణం తలెత్తే ప్రశ్న. తన ఆటవిక స్వరూపాన్ని ఇంత అత్యవసరంగా వెల్లడి చేయవలసిన అగత్యం ఏమొచ్చింది? ఇది రెండవది. మొదటి ప్రశ్నకు సమాధానం సోవియట్‌ యూనియన్‌ పతనంలో, దానితోబాటు సోషలిస్టు శక్తులనుండి ఎదురయ్యే సవాలు ముగిసిపోవడంలో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక, సోవియట్‌ యూనియన్‌ కొనసాగినంత కాలమూ సామ్రాజ్యవాదుల ఆటవికతను నిరోధించే శక్తిగా అది వ్యవహరించింది. తక్కిన దేశాల్లో కూడా సోషలిజం వచ్చేస్తుందేమోనన్న భయంసామ్రాజ్యవాదుల ఆటవికత బైటపడకుండా నిలుపు చేసింది. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణమైన ఆటవికతను అడ్డుకున్నది సోషలిజమే. రోజా లక్సెంబర్గ్‌ ఆనాడు చెప్పినది సత్యం అన్నది దీనిని బట్టే రుజువు అయింది. ఒకసారి ఆ సోషలిజం అనేది లేకుండా పోయాక ఇప్పుడు పెట్టుబడిదారీ శక్తులకు అడ్డు లేకుండా పోయింది.

ఇక రెండవ ప్రశ్నకు సమాధానం ఇది: గతంలో సామ్రాజ్యవాదం ఆధిపత్యం వలస విధానం అంతం కావడంతో అస్థిరతకు లోనైంది. వలసల స్వాతంత్య్రాన్ని అంగీకరించవలసి వచ్చింది. ఆ దేశాల్లో ప్రభుత్వాల ప్రత్యక్ష జోక్యంతో ఆర్థిక వ్యవస్థలు కొంతమేరకైనా సామ్రాజ్యవాద ఉచ్చు నుండి బైట పడగలిగాయి. ఆ తర్వాత నయా ఉదారవాద వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా తిరిగి నెలకొల్పడం ద్వారా సామ్రాజ్యవాదం మళ్ళీ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకోగలిగింది. ఐతే గతంలో వలస విధానం నాటి పరిస్థితికి, ప్రస్తుత నయా ఉదారవాద వ్యవస్థ కాలానికి ఒక కీలకమైన తేడా ఉంది. గతంలో సామ్రాజ్యవాద దేశాల నడుమ పరస్పర వైరుధ్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ వైరుధ్యాలు మూగబోయాయి. గతంలో ఎన్నడూ లేనంత ఐక్యంగా ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలు వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం ఆ దేశాలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నడిపిస్తోంది. దానికి ఈ ప్రపంచం ముక్కలు కావడం ఇష్టం లేదు. అందుచేత ప్రపంచ పెట్టుబడి అంతా ఏకమైంది. అది ప్రపంచం మొత్తం మీద ఉన్న శ్రామిక ప్రజానీకాన్ని-అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల కార్మికులనేగాక మూడవ ప్రపంచ దేశాలలోని కార్మికులను, రైతాంగాన్ని కూడా-తన దోపిడీకి బలి చేస్తోంది.

ఐతే, ఈ విధంగా జరుగుతున్న దోపిడీ కారణంగానే ఇప్పుడు ఆ సామ్రాజ్యవాద పెత్తనం సంక్షోభంలో పడింది. తాను సాగిస్తున్న దోపిడీ కారణంగా శ్రామిక ప్రజల వినిమయ శక్తి పడిపోయింది. దాని ఫలితంగా మార్కెట్‌లు పెరుగుదల లేకుండా నిలిచిపోయాయి. ఇప్పుడున్న ఉత్పత్తి కూడా చెల్లుబాటు అవని పరిస్థితులు వస్తున్నాయి. ఈ సమస్యకు నయా ఉదారవాద చట్రం పరిధిలో పరిష్కారం లేదు. ప్రభుత్వాలు చురుకుగా మార్కెట్‌లో జోక్యం చేసుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది. ఆవిధమైన జోక్యాన్ని నయా ఉదారవాదం సహించదు. ఈ విధంగా మార్కెట్‌లు పెరుగుదల లేకుండా పోయి ఉత్పత్తిలో చెల్లుబాటు కాకుండో పోతున్న కారణంగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. అది మరింతగా మార్కెట్‌ ముడుచుకుపోడానికే దారి తీస్తుంది. నయా ఉదారవాద వ్యవస్థ మనుగడకు ఉన్న ముప్పు మరింత తీవ్రతరమౌతోంది. ఈ సంక్షోభమే ఫాసిస్టు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదం చేసింది. అంతేగాక పెట్టుబడిదారీ ప్రభుత్వాలు-అవి ఫాసిస్టు స్వభావం కలిగినవైనా, వాటికి ఫాసిస్టు స్వభావం లేకపోయి నా, అన్నీ ఉమ్మడిగా శ్రామిక ప్రజలను అణచి వేస్తున్నాయి. ఇతర దేశాల్లోని అణచివేతలను సమర్ధిస్తున్నాయి. ఈ అణచివేతకు ఎటువంటి నీతి, నియమం లేవు. ఆటవికత తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఆ ఆటవికత ఎక్కడ ఏ విధంగా వ్యక్తం అయినా, దానిని పెట్టుబడిదారీ శక్తులన్నీ కట్టగట్టుకుని బలపరుస్తున్నాయి.

( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
➡️