చావుల్లేని చదువులు కావాలి !

Jan 5,2024 07:20 #Editorial

                ఎంతో వెలుగుల భవితవ్యాన్ని చూడాల్సిన విద్యార్థులు అర్ధాంతరంగా జీవితాలను ముగించుకోవడం అత్యంత బాధాకరం. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రభుత్వ విద్యకు గండి కొట్టి, కార్పొరేటుకు పట్టం కట్టి, సమిష్టి భావన స్థానే వ్యక్తివాదానికి పాదులు తీసిన పరిణామాల అన్నింటి పర్యవసానమే ఇది. నిన్నగాక మొన్న బెంగళూరులో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. దానికి కొద్ది రోజుల ముందు ఢిల్లీలో ఐఐటి విద్యార్థి రైలు కింద పడి, ప్రాణాలు తీసుకున్నాడు. నీట్‌, ఐఐటి వంటి కోర్సుల్లో సీట్ల కోసం శిక్షణ ఇచ్చే రాజస్థాన్‌లోని కోటా కోచింగ్‌ సెంటర్లలో ఆత్మహత్యలు పరిపాటి అయ్యాయి. ఒక్క 2023లోనే అక్కడ 26 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి) సమాచారం ప్రకారం… 2022లో దేశం మొత్తమ్మీద 13,044 మంది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. నవ్వుతూ తుళ్లుతూ చదువుల పర్వాన్ని సాగించాల్సిన తరుణం నేటితరం విద్యార్థులకు ఎందుకని చీకటి కుహరంగా మారుతుంది? ఇరవై ఏళ్ల క్రితం ఇంతగా లేని ఆత్మహత్యలు ఇప్పుడెందుకు ఏడాదికి వెయ్యికి పైబడి చోటు చేసుకుంటున్నాయి? దేశంలో వేళ్లూనుకున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారమయం చేశాయి. సమాజ ఉత్థాన పతనాలను, చరిత్ర ఆటుపోట్లను వివరించి, ఆత్మస్థైరాన్ని పెంచే సామాజిక శాస్త్రాల బోధన అవసరమే లేదని తేల్చి పడేశాయి! తీవ్రమైన పోటీ, ఒత్తిడి గొప్ప ఫలితాలను ఇస్తాయన్న యాంత్రిక ధోరణిని విద్యార్థులపై మోపాయి. దీనికితోడు సందట్లో సడేమియాలా జొరబడుతున్న విద్య కాషాయీకరణ విద్యార్థుల్లో ప్రశ్నించే స్వభావాన్ని నిర్వీర్యం చేస్తోంది. నవోత్తేజంతో ఉరకలు వేయాల్సిన విద్యార్థిలోకం వీటన్నిటి మూలంగా నిస్తేజితమవుతోంది. ఒత్తిడిని తట్టుకోలేని, వైఫల్యాన్ని అంగీకరించలేని నీరస గళంగా మారుతోంది. కోటాలో ఆత్మహత్యల నేపథ్యంలో నియమించిన భవానీ సింగ్‌ దేథా కమిటీ కూడా అదే విషయాన్ని నొక్కి వక్కాణించింది.

సమాజంలో చదువులు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ- ఈ ఇరవై ఏళ్లలోనే ఇలాంటి విపరీతాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని లోతుగా విశ్లేషిస్తే- విద్య, వైద్యం తదితర రంగాలకు నూతన ఆర్థిక విధానాలు చేసిన చేటు ఏమిటో అర్థమవుతుంది. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం; కార్పొరేటు విద్యాసంస్థలు విచ్చలవిడిగా విస్తరించే అవకాశాలు కల్పించటం; ప్రయివేటు, కార్పొరేటు చదువులతోనే భవిష్యత్తు వెలిగిపోతుంది అన్న భావనను పెంపొందించటం గడిచిన మూడు దశాబ్దాల్లో విపరీతంగా జరిగిపోయింది. లక్షలు పోసి పిల్లలను చదివిస్తున్న సగటు మధ్య తరగతి కుటుంబాల ఆకాంక్షలు పిల్లల మీద క్షణ క్షణం ఒత్తిడిని రాజేస్తున్నాయి. దీనికితోడు అత్యధిక ప్రయివేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో పిల్లలను నిరంతర ఒత్తిడితో నలిబిలి చేయడం తప్ప ఎక్కడా ఉత్తేజాన్నిచ్చే ఆటపాటల జాడ లేదు. సాధించి తీరాలనే పోటీ ఉపదేశాలు తప్ప వినోద వికాసాలకు విలువ లేదు. మార్కులూ ర్యాంకుల లెక్కలతోనే విద్యాసంస్థల మూలమూలలూ పిక్కటిల్లుతున్నాయి. ఇలాంటి ఊపిరి సలపని పీడన వాతావరణంలో నిర్దేశిత లక్ష్యాలను చేరలేదనో, చేరలేమనో విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. బతకటానికి అనేక దారులు, అవకాశాలూ ఉన్నాయన్న భరోసా, సాంత్వన వారికి లభించకుండా పోతోంది.

ఈ అసహజ, అమానవీయ చదువుల చిత్రాన్ని సమర్పించిన ఉదారవాద ఆర్థిక విధానాల చట్రాన్ని బద్దలు కొట్టాలి. అప్పుడే ఊపిరి సలపని చదువుల నుంచి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం లభిస్తుంది. దీనికోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి, యువజన సంఘాలూ, మేధావులూ పూనుకోవాలి. ప్రభుత్వాలు తక్షణం స్పందించి, ఇప్పటివరకూ వివిధ కమిటీలు చేసిన సిఫార్సులను అమలు చేయాలి. ఆటలూ పాటలతో కూడిన చదువు; తలకు, తనకూ బరువు కాని చదువూ విద్యార్థికి అందించాలి. పిల్లల శక్తిని, ఆసక్తిని అంచనా వేసి, తదనుగుణమైన విద్యనే అందించటానికి తల్లిదండ్రుల వైపు నుంచీ ప్రయత్నం జరగాలి. గొప్ప గొప్ప చదువులు, స్థానాలూ, సాధనలూ అవసరమైనవే! కానీ, జీవితం వాటన్నిటికన్నా ముఖ్యమైనది. అందుకనే మన విద్యావ్యవస్థను ఆమూలాగ్రం పునర్నిర్మించుకోవాలి. చావులూ, సంక్షోభాలూ లేని చదువులు నాగరిక, మానవీయ సమాజానికి నాందీవాచకాలు.

➡️