మానవ హక్కులను మసి చేసిన మనుస్మృతి

Dec 23,2023 07:18 #Editorial

వర్ణాశ్రమ ధర్మాన్ని మనుషుల మీద రుద్దడానికే మనుస్మృతి ఉనికిలోకి వచ్చింది. ఈ విషయం మనుస్మృతి లోని రెండవ శ్లోకంలోనే దాపరికం లేకుండా చెప్పారు. ”కొందరు మహర్షులు ఒకరోజు మనువు దగ్గరికి వెళ్లి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాల గురించి చెప్పమని అడిగారట. మనువేమో భృగు మహర్షి చెప్తాడని వారిని పంపించారట. సమాజం మనుగడ సాఫీగా సాగడానికి మనుస్మృతి రాశారని ఎవరైనా చెబితే అది పెద్ద మోసం. మెజారిటీ ప్రజలను దోచుకొని మైనారిటీ జనం సుఖ భోగాలను అనుభవించడానికే మనుస్మృతి ఉనికిలోకి వచ్చింది. అలాగే మహిళలను అణచిపెట్టడానికి పనికొచ్చింది. ఆ స్మృతి ఒకరు రాసింది కాదు. తమ సుఖం కోసం బ్రాహ్మణులు వందల యేళ్లపాటు తమ ప్రక్షిప్తాలు జోడించారు.

                మెజారిటీ ప్రజలకు మానవ హక్కులను మృగ్యం చేసేది మనుస్మృతి. మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన బాబా సాహెబ్‌ తన ఉద్యమ తొలినాళ్లలోనే మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టారు. 1927 డిసెంబర్‌ 25న, అంటే 96 ఏళ్ల క్రింతం మహద్‌ చెరువు పోరాటం సందర్భంగా దాన్ని దహనం చేశారు. మహద్‌ చెరువులోని నీటిపై దళితులకు కూడా హక్కు ఉందని చాటడానికి జరిగిన పోరాటమని మహర్లు, చంబార్లు, మాంగులతో పాటు అంటరానితనానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే ఉన్నత కులాల వారినీ సమీకరించారు అంబేద్కర్‌. మహద్‌ సభలో మనుస్మృతిని తగలబెట్టాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించే బాధ్యతను ఒక బ్రాహ్మణుడికి అప్పగించారాయన. అప్పటికే ఆంగ్లేయుల పాలనలోని బొంబాయి శాసనసభ, ప్రభుత్వ వనరులను, స్థలాలను అంటరానివారితో సహా అందరూ ఉపయోగించుకోవచ్చన్న తీర్మానాన్ని ఆమోదించింది. అయినా బ్రాహ్మణులు ఇతర ఉన్నత కులాలవారు అడ్డుకున్నారు.

మనుస్మృతి దహనంతో మొత్తం భారతదేశ దృష్టిని అంబేద్కర్‌ ఆకర్షించారు. ఆయన ఉద్యమాన్ని, ఆలోచనలను లెక్కచేయని పత్రికలు దహనం తర్వాత అంబేద్కర్‌పై కాలు దువ్వి కయ్యానికి దిగాయి. తమ సంపాదకీయాల్లో ఎడాపెడా తిట్టేశాయి. ఆ తిట్లు అంటరానితనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం పాలిట వరాలయ్యాయి. అంబేద్కర్‌ ఉద్యమం గురించి కొత్తగా చాలా మందికి తెలిసొచ్చింది. ఆ ఉద్యమంపై నిప్పులు చెరిగిన పత్రికలకు అంబేద్కర్‌ తన ”బహిష్కృత్‌ భారత్‌” పత్రికలో ఘాటైన సమాధానాలు ఇచ్చారు.వర్ణాశ్రమ ధర్మాన్ని మనుషుల మీద రుద్దడానికే మనుస్మృతి ఉనికిలోకి వచ్చింది. ఈ విషయం మనుస్మృతి లోని రెండవ శ్లోకంలోనే దాపరికం లేకుండా చెప్పారు. ”కొందరు మహర్షులు ఒకరోజు మనువు దగ్గరికి వెళ్లి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాల గురించి చెప్పమని అడిగారట. మనువేమో భృగు మహర్షి చెప్తాడని వారిని పంపించారట. సమాజం మనుగడ సాఫీగా సాగడానికి మనుస్మృతి రాశారని ఎవరైనా చెబితే అది పెద్ద మోసం. మెజారిటీ ప్రజలను దోచుకొని మైనారిటీ జనం సుఖ భోగాలను అనుభవించడానికే మనుస్మృతి ఉనికిలోకి వచ్చింది. అలాగే మహిళలను అణచిపెట్టడానికి పనికొచ్చింది. ఆ స్మృతి ఒకరు రాసింది కాదు. తమ సుఖం కోసం బ్రాహ్మణులు వందల యేళ్లపాటు తమ ప్రక్షిప్తాలు జోడించారు.

మనుస్మృతిలో దేవుడు బ్రాహ్మణులకు నాలుగు నియమాలను విధించాడట. అధ్యయనం (నేర్చుకోవడం), అధ్యాపనం (నేర్పించడం), యజనం (యజ్ఞం చేయడం), యాజనం (యజ్ఞం చేయించడం). క్షత్రియునికేమో ధర్మబద్ధ పాలన, తనవారి సంరక్షణ, వైశ్యులకేమో వస్తు సేకరణ, ధనార్జన ధర్మంగా చెప్పారు. శూద్రుల విధి పై మూడు వర్ణాలకు సేవ చేయడమే అని నిర్దిష్టంగా నిస్సిగ్గుగా చెప్పారు. దానికి కారణం నాల్గవ వర్ణమైన శూద్రుల్లో పూర్తిగా అజ్ఞానం ఉంటుందని సిద్ధాంతీకరించారు. వారి శారీరక మానసిక స్థితిలోనూ అనేక దోషాలుంటాయని వర్ణం మార్చుకోవడం సాధ్యం కాదనీ చెప్తుంది. మరి పంచములు ఎలా వచ్చారో స్మృతి చెప్పదు. కాని శూద్రల కంటే పంచములతో ఎంత అన్యాయంగా, అనాగరికంగా వ్యవహరించవచ్చో చెప్తుంది. మనుస్మృతి క్రీస్తు పూర్వం నుండే రాసిందే అయినా ఇప్పటికీ దాని ప్రభావం హిందూ సమాజంపై గాఢంగా ఉంది.

స్త్రీలకు మనుస్మృతి ఆస్తి హక్కునిచ్చిందని, వరకట్నాలు కన్యాశుల్కాన్ని నిషేధించిందని, స్త్రీకి మళ్లీ చేసుకొనే అవకాశం ఉందని సంతానవతి అయిన భార్య బతికుండగా పురుషుడు మరో పెళ్లి చేసుకోవడాన్ని నిషేధించిందని చెప్తారు. ఆ హక్కులన్నీ ఎక్కడికి పోయాయి? వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన నేటి దశలోనూ సంతానం లేకపోవడానికి స్త్రీయే కారణం అన్న భావన అత్యధికుల్లో ఇప్పటికీ ఉండటానికి మనుస్మృతే కదా కారణం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: అంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని అర్థం. మనుస్మృతిలో ఈ శ్లోకం ఉన్న మాట నిజం. అదే సమయంలో స్త్రీ బాల్యంలో తండ్రి సంరక్షణలో, యవ్వనంలో భర్త సంరక్షణలో, ముసలితనంలో పుత్రుడు లేదా బంధువుల సంరక్షణలో ఉండాలి. స్త్రీ స్వతంత్రంగా ఉండటానికి వీల్లేదన్న (నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి) శ్లోకం కూడా మనుస్మృతి లోనే ఉంది కదా? స్త్రీ మాత్రమే కామ పీడితురాలు అయినట్లు చెప్పే శ్లోకాలు కూడా మనుస్మృతిలో ఉన్నాయి. అనేక చోట్ల స్త్రీలపై ఆంక్షలు విధించి, ఈ ఒక్క శ్లోకంతో పాప పరిహారం పొందాలంటే ఎలా చెల్లుతుంది?

తండ్రి, సోదరులు తనను ఎవరికి అప్పగిస్తారో అతనికి జీవితాంతం స్త్రీ సేవలు చేయాలి. అతను చనిపోతే మళ్లీ పెళ్లి చేసుకోరాదు. భర్తను ఆదరిస్తే అతను పరలోకంలో కూడా స్త్రీకి సుఖాన్నిస్తాడు. దురాచారి, స్త్రీ లోలుడు సుగుణాలు లేని భర్తను కూడా ఆదరించాలి. అంటే ఆ బాపతు పరలోకంలో కూడా వదలడన్న మాట. మంత్రాలోచన సమయంలో వికలాంగులను, వృద్ధులను మ్లేచ్చులను, స్త్రీలను అక్కడి నుండి పంపించాలని మనుస్మృతి చెప్తుంది. అప్పులకు సంబంధించి ఒక స్త్రీ మరో స్త్రీకి సౌక్ష్యంగా ఉండవచ్చట. ఇతర విషయాల్లో మంచి బుద్దిగలవారైనప్పుటికీ స్త్రీలు సాక్ష్యానికి పనికిరారట. ఎందుకంటే వారు చపల చిత్తులని మనుస్మృతి చెప్తుంది కాని నిజానికి సంకల్ప శుద్ధి స్త్రీల్లోనే ఎక్కువ కన్పిస్తుంది. ముస్లింల్లోనూ ఇద్దరు స్త్రీ సాక్షులు ఒక పురుష సాక్షికి సమానమట. ఎందుకంటే భగవంతుడు స్త్రీకి సగం మెదడు మాత్రమే ఇచ్చారని ముస్లిం బోధకులు చెప్తుంటారు. ఎంత అశాస్త్రీయం?

మనుస్మృతిని భారత రాజ్యాంగంతో పోల్చుతూ అర్థంలేని వాదన కూడా చేస్తారు. రాజ్యాంగానికి సవరణలు చేసినట్లే మనుస్మృతి లోనూ కాలమాన పరిస్థితులను బట్టి మార్పులు చేసుకోవచ్చంటారు. 1950 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కనుక మనుస్మృతితో పని లేదని మాత్రం చెప్పరు. ఎందుచేత? రాజ్యాంగ సవరణకు నిర్ణీత పద్ధతులున్నాయి. ఒక వేదిక ఉంది. పార్లమెంట్‌లో మూడింట రెండవ వంతు సభ్యుల ఆమోదంతో మాత్రమే రాజ్యాంగ సవరణ చేయవచ్చు. మరి మనుస్మృతిని ఎక్కడ, ఎవరు, ఏ విధంగా సవరించవచ్చో చెప్పలేరు. భగవంతుడే మనుషులను అసమాన సామర్థ్యంతో నాలుగు వర్ణాలుగా పుట్టించారన్న మౌలిక అవగాహనలో మాత్రం ఎలాంటి సవరణ జరగలేదు. అలాగే శూద్రులు, పంచముల పట్ల సామాజిక వివక్ష చూపాలన్న శ్లోకాల్లో సవరణ జరగలేదు. స్మృతిలో అనేక మూఢనమ్మకాలూ ఉన్నాయి. వాటికీ జరగలేదు కదా !

యూరపు దేశాలు ఫ్యూడల్‌ వ్యవస్థ నుండి బయట పడి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పేర ప్రభుత్వాలను ఏర్పరచుకొన్నాయి. ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వాలు ఏ పాటివి? అన్న విషయాన్ని పక్కన పెడదాం. ఆ దశలో భారతదేశం లోకి తమ మార్కెట్లను విస్తరించుకోవడానికి వచ్చిన ఆంగ్లేయ కంపెనీలు మన దేశాన్ని వలసదేశంగా మార్చుకొని పరిపాలన సాగించాయి. తమ పాలన కోసం ఒక చట్టం రూపొందిం చాలని చూస్తున్న దశలో వారికి మనుస్మృతి తమకు అనుకూల గ్రంథంగా కన్పించింది. బ్రిటిష్‌ పాలకుల ఆదేశం మేరకు కోల్‌కతా లోని జగన్నాథ తర్క పంచానన అనే సంస్కృత పండితుడు మనుస్మృతిపై ఒక గ్రంథం రాశారు. మనుస్మృతితో పీడిత వర్గాలను ఎంత సునాయసంగా దోచుకోవచ్చో బ్రిటిష్‌ పాలకులు కూడా గుర్తించారు. ఆ తర్వాత చాలా మంది ఆంగ్లేయులు మనుస్మృతిని ఇంగ్లీషులోకి అనువదించారు. ప్రజలను విడదీసి పాలించడానికి ఒక రెడీమేడ్‌ సాధనంగా వారికి మనుస్మృతి కన్పించడంలో ఆశ్చర్యం లేదు.

ఏ మతమైనా, తమ మత గ్రంథాలు దేవుడి నుండి నేరుగా వెలువడినవేనని, వాటిని సవరించడానికి ఏ మాత్రం వీల్లేదని చెప్తుంది. కాని మతాచరణలో అనేక మార్పులు జరుగుతుంటాయి. మారనిదల్లా మార్చడానికి అవకాశం లేదన్న అబద్దం మాత్రమే. ఇతర మతాల్లోలాగే వేదాలను కూడా అపౌరుషేయాలని చెప్పారు. అంటే వాటిని పురుషులు (మనుషులు) రాయలేదని అర్థం. వేదాలు సులభంగా అర్థమయ్యేవిగావని అందులో పెక్కు శాఖలున్నాయని, వేదాలకు పరిమితి నిర్ణయించలేమనీ చెప్పారు. దానివల్ల హిందూ మతంలోకి దేనినయినా సులభంగా కలిపేసుకొని దాని అవశేషంగా మిగిల్చే అవకాశం దక్కింది. బౌద్ధాన్ని, జైనాన్ని, సూఫీ బోధనలను, దర్గాలను, క్రైస్తవ బోధనలను ఒకటేమిటి సర్వం స్వీకరించి ”వాతాపి జీర్ణం” అని త్రేన్చవచ్చు.

అలా చూస్తే బిజెపి ప్రవచించే పరమత ద్వేషం మతపరమైంది కాదు. అది కేవలం రాజకీయపరమైంది. ముస్లింలపై, క్రైస్తవులపై అది విద్వేషం నూరిపోస్తుంది. మనుస్మృతి శూద్రులకు భావప్రకటనా స్వేచ్ఛను కూడా నిరాకరించింది. పైమూడు వర్ణాల వారిని విమర్శించకుండా వారికి శూద్రులు శుశ్రూష చేయాలని శాసిస్తుంది. కష్టం చేసే వాడికే కదా నిష్కామ కర్మ సిద్ధాంతం వర్తించేది. మానవుల్లో బ్రాహ్మణులు శ్రేష్టులని చెప్తుంది. భూమి మీద ఉన్న సంపద అంతటికీ బ్రాహ్మణుడే అర్హుడంటుంది.

ఎవరిదీ కాని నిధి బ్రాహ్మణుడికి దొరికితే దాన్ని అతను పూర్తిగా తీసుకోవచ్చు. రాజుకు దొరికితే సగం బ్రాహ్మణులకిచ్చి సగం ఖజానాకు తరలించాలి. శూద్రుడు ఆస్తికి హక్కుదారుడు కాదు గనుక ఆ సమస్యే రాదు. బ్రాహ్మణుడిని తిడితే క్షత్రియునికి నూరు రూకలు, వైశ్యునికి 200 రూకలు, శూద్రునికి దెబ్బలు దండనగా విధించాలి. బ్రాహ్మణుడు క్షత్రియుడిని తిడితే యాభై రూకలు, వైశ్యుడిని తిడితే 25 రూకలు, శూద్రుడిని తిడితే 12 రూకలు, దండన విధించాలి. చట్టం ముందు అందరూ సమానమేనన్న సూత్రం వర్తించదు. శూద్రుడు ద్విజులను ‘పాపిష్టి వాడా’ అని తిడితే వాడి నాలుక కోసెయ్యాలి. ఎందుకంటే వాడిది హీన జన్మ అని స్మృతి లోని శ్లోకాలు చెప్తాయి. రాజ్యాంగం దృష్టిలోనేమో పౌరులందరూ సమానమే, మను ధర్మంలో శిక్షలు, దుస్తులు, ఆభరణాలు, ఆచారాలు వర్ణ, కులాలను బట్టి ఉంటాయి. మనుస్మృతి అన్ని విధాలా వివక్షాపూరితమైనది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత రాజ్యాంగానికీ పూర్తి విరుద్ధమైనది. అందుకనే దాన్ని తిరస్కరించాలి.

/వ్యాసకర్త 'ప్రజాశక్తి' పూర్వ సంపాదకులు/ఎస్‌. వినయ కుమార్‌
/వ్యాసకర్త ‘ప్రజాశక్తి’ పూర్వ సంపాదకులు/ఎస్‌. వినయ కుమార్‌
➡️