మోడీ పాలనలో నలుగుతున్న నాలుగో స్తంభం

Dec 20,2023 07:17 #Editorial

నేటి పాలకులు 19వ అధికరణను తుంగలో తొక్కారు. పత్రికా సమావేశాల ఊసే లేదు. సంఘీయులు పాత్రికేయులను విదేశాల్లో కూడా అవమానించారు. దాడులు చేశారు. నిజాలను బయటపెట్టి, నిర్మోహమాటంగా ప్రశ్నించిన, దేశభక్త, సత్యశోధక, ప్రజాపాత్రికేయులు, నిర్వాహకులను పాలకులు ‘నేర పరిశోధన’ సంస్థల దాడులకు గురిచేస్తున్నారు. తమను సమర్థించని పాత్రికేయుల కంప్యూటర్లను విచ్ఛిన్నం చేశారు. వాటిలో తప్పుడు సమాచారాలను ఎక్కించారు. దొంగసాకులతో ప్రాథమిక సమాచార నివేదిక, విచారణలు లేని, బెయిలు అవకాశం లేని చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం (ఉపా) కింద వారిని నిర్బంధిస్తున్నారు. జైళ్ళలో కుక్కుతున్నారు.

          ‘పత్రికా స్వేచ్ఛ వదలరాని విలువైన ప్రత్యేక హక్కు’ అన్నారు గాంధీ. పత్రికా రంగం ప్రజాస్వామ్య నాల్గవ స్తంభం. మానవత్వ విలువల, సామాజిక బాధ్యతల, నైతిక పాత్రికేయత సమాజ నిర్మాణానికే మూలం. భారత జాతీయోద్యమంలో, స్వాతంత్య్ర సమరంలో, స్వేచ్ఛా సాధనలో, జాతీయ భావాల ప్రచారంలో, ఉద్యమాల నిర్మాణంలో, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజాసమీకరణ, ఐక్యతలలో, బలమైన ప్రజాభిప్రాయ నిర్మాణంలో పత్రికారంగం కీలకంగా కృషి చేసింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనలో, బ్రిటిష్‌ రాణి ప్రత్యక్ష ఏలుబడిలో బ్రిటిష్‌ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై అనేక పరిమితులు విధించింది. లండన్‌ నుండి ప్రచురించే పత్రికలు భారత స్వాతంత్య్ర పోరాట ఘటనలను వక్రీకరించాయి. స్వాతంత్య్రం తర్వాత భారత రాజ్యాంగ అధికరణ 19, దాని ఉపాధికరణలు వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛలను అందించాయి. జాతీయోద్యమంలో పాత్రికేయ కట్టడితో బాధలు పడిన భారత తొలి పాలకులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించలేదు. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించినట్లు, తనపై ‘శంకర్స్‌ వీక్లీ’ విమర్శలను ఆహ్వానించినట్లు చరిత్ర చెప్తోంది. ప్రభుత్వ విధానాల విమర్శ వ్యక్తి విమర్శ కాదని, దిద్దుబాట్లకు అవకాశం ఇస్తుందని, దేశ నిర్మాణంలో అది అవసరమని నెహ్రూ ఉద్దేశం కావచ్చు. అయితే రాజ్యాంగంలోని 352(2) అధికరణం ప్రకారం ఇందిర ఎమర్జెన్సీని రుద్దారు. 25 జూన్‌ 1975 నుండి 21 మార్చి 1977 వరకు 21 నెలల పాటు సాగిన ఎమర్జెన్సీ కాలంలో పత్రికా స్వేచ్ఛ హరించబడింది. పాత్రికేయులను జైళ్ళలో పెట్టారు. కాని సమాజాన్ని మత పరంగా చీల్చలేదు. వైదికవాదులను ముస్లిం, క్రైస్తవులపై ఉసిగొల్పలేదు. ఆధిపత్య వర్ణాధికారంతో అల్ప సంఖ్యాకులను పరాయీకరించలేదు. ప్రపంచీకరణలో ఉత్పత్తి రంగాలు, జాతి సంపదలతో పాటు సేవలనూ ప్రయివేటీకరించారు. ఈ నేపథ్యంలో పాత్రికేయ విధానంపై పరిమితులు ప్రారంభమయ్యాయి. వార్తాప్రసారం ప్రభుత్వాధికారంగా మారింది. కాని, వార్తా ప్రసార వ్యవస్థలు అందులో ప్రవేశించరాదన్న భావాన్ని కల్పించారు. అయినా నాటి ప్రభుత్వాలు క్రమం తప్పకుండా పత్రికా సమావేశాలను నిర్వహించేవి.

నేటి పాలకులు 19వ అధికరణను తుంగలో తొక్కారు. పత్రికా సమావేశాల ఊసే లేదు. సంఘీయులు పాత్రికేయులను విదేశాల్లో కూడా అవమానించారు. దాడులు చేశారు. నిజాలను బయటపెట్టి, నిర్మోహమాటంగా ప్రశ్నించిన, దేశభక్త, సత్యశోధక, ప్రజాపాత్రికేయులు, నిర్వాహకులను పాలకులు ”నేర పరిశోధన” సంస్థల దాడులకు గురిచేస్తున్నారు. తమను సమర్థించని పాత్రికేయుల కంప్యూటర్లను విచ్ఛిన్నం చేశారు. వాటిలో తప్పుడు సమాచారాలను ఎక్కించారు. దొంగసాకులతో ప్రాథమిక సమాచార నివేదిక, విచారణలు లేని, బెయిలు అవకాశం లేని చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం (ఉపా) కింద వారిని నిర్బంధిస్తున్నారు. జైళ్ళలో కుక్కుతున్నారు. టెలిగ్రాఫ్‌ ఆంగ్ల దినపత్రిక సంపాదకుడు ఆర్‌.రాజగోపాల్‌, అంతర్జాల పత్రిక ‘న్యూస్‌ క్లిక్‌’ నిర్వాహకులు ప్రబీర్‌ పురకాయస్థ, ముకేశ్‌ చక్రవర్తి మొదలగువారు ఈ జాబితాలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత బాలిక అగ్రవర్ణ సామూహిక అత్యాచారహత్యకు గురయ్యారు. ఆ సమాచార సేకరణకు వెళుతున్న కేరళవాసి, ఢిల్లీ పాత్రికేయుడు సిద్ధిఖ్‌ కప్పన్‌ను ఉపా చట్టం కింద అక్టోబర్‌, 2020లో అరెస్టు చేసి మథుర జైల్లో పెట్టారు. అక్కడ ఆయనకు కోవిడ్‌ వచ్చినా బెయిలివ్వలేదు. రెండేళ్ల తర్వాత బెయిల్‌ ఇచ్చినా మరొక కేసులో జైల్లోనే ఉంచారు. 2022 డిసెంబర్‌ 23న అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఇద్దరు స్థానికుల రూ.లక్ష హామీ షరతు విధించింది. కేరళీయ, ఢిల్లీ పాత్రికేయునికి స్థానిక నగదు పూచీకత్తు సాధ్యమా? అయితే న్యాయస్థానాలు కూడా పాత్రికేయుల ప్రభుత్వ అనుబంధాన్ని బట్టి బెయిల్‌ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఆర్ణబ్‌ గోస్వామి బెయిల్‌ కోసం ఒకేసారి కింది కోర్టు నుండి సుప్రీంకోర్టు దాకా అభ్యర్థనలు దాఖలు చేసినా న్యాయమూర్తులు అభ్యంతర పెట్టలేదు. పాత్రికేయులకు న్యాయం చేయడం న్యాయస్థానాల బాధ్యతన్నారు. బెయిల్‌ ఇచ్చి, ఆ తీర్పు ప్రతి అందినంత వరకు ఆగవద్దని, అంతర్జాల ప్రతి ఆధారంగానే చర్య తీసుకొమ్మని ఆదేశించారు.

ఈ రోజు 72 శాతం పత్రికలు, టీవీ లు న్యూస్‌-18 పేరుతో ముకేశ్‌ అంబానీవే. కోల్‌కతా పాత్రికేయురాలు రాధిక రారు, ఆమె భర్త ఆర్థిక నిపుణులు ప్రణరు రారు 1984లో 24 గంటల ప్రసార స్వతంత్ర న్యూ ఢిల్లీ టివి (ఎన్డిటివి) నిస్థాపించారు. వార్తాప్రసారాలపై ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని ఛేదించారు. నిష్పక్షపాత వార్తలను అందించారు. ప్రధాని మోడీ ఎన్‌డిటివి కి ప్రకటనలు ఆపు చేయించారు. వ్యాజ్య వ్యూహం పన్నారు. వారి పత్రికా స్వేచ్ఛపై దాడిచేశారు. 2022 ఆగస్టులో బహుళ జాతిసంస్థ యజమాని, మోడీ మిత్రుడు గౌతమ్‌ అదానీ ఎన్‌డిటివిలో 29.18 శాతం వాటాను కబ్జా చేశారు. నవంబర్‌లో మరో 8 శాతం వాటాను కొన్నారు. డిసెంబర్‌లో రారు దంపతుల నుండి 27.53 శాతం వాటాను మాయాజాలంతో సంపాదించారు. దీంతో ఎన్‌డిటివిలో అదానీ వాటా 64.71కి ఎదిగింది. మోడీ అనానుకూల, ప్రజానుకూల పాత్రికేయత మూతపడింది. పత్రికల సంపాదక ప్రమాణాల పెంపుకు, పత్రికా స్వేచ్ఛ రక్షణకు స్థాపించిన స్వతంత్ర సంస్థ ‘భారత ఎడిటర్స్‌ గిల్డ్‌’కు మౌనమే మిగిలింది. దేశంలో ప్రతి రాజకీయ పార్టీకి దినపత్రికలు, టీవీ ఛానళ్ళున్నాయి. 2021 ఫిబ్రవరికి 900 అనుమతించిన ప్రయివేట్‌ ఉపగ్రహ ఛానళ్ళున్నాయి. ఇవి తమ యాజమాన్య కార్పొరేట్‌ సంస్థలకు, తమకు వాణిజ్య ప్రకటనలిచ్చిన సంస్థలకు, కార్పొరేట్‌ అనుబంధ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తాయి.ప్రజాస్వామ్యానికి, సమాజానికి ప్రజలే కీలకం. ఈ రోజు ప్రజలు మతాధారంగా చీల్చబడుతున్నారు. పాలకులు మెజార్టీ మతస్తులకు మతోన్మాదాన్ని ఎక్కించారు. వారి మెదళ్ళను అబద్దాలతో, చారిత్రక వక్రీకరణలతో నింపారు. ఈ పనిలో పాలకవర్గ దళారి సంస్థల ధృతరాష్ట్ర విశ్వవిద్యాలయం (వాట్సాప్‌) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు పురుషుల క్రికెట్‌, నేరాలు, చలన చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు పత్రికారంగ ప్రధాన అంశాలు. సామాన్యులకు, స్త్రీలకు, సామాజికంగా వెనక్కు నెట్టబడ్డవారికి స్థానం లేదు. నేటి పాలకులు రాబోయే ఎన్నికల్లో కూడా నెగ్గితే ప్రజా పాత్రికేయతకే కాదు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, పేద ప్రజా బాహుళ్యానికి ముప్పు.

సమాజ మార్పునకు పత్రికా రంగం తక్షణ స్వల్పకాలిక ఆయుధం. సత్య సేకరణ, వాస్తవ నివేదిక పాత్రికేయతకు ప్రధానం. పాత్రికేయతనూ, పాత్రికేయులనూ నేటి పాలకులు చీల్చారు. ప్రభుపక్ష పాత్రికేయులను ప్రయోజనాలతో ప్రోత్సహి స్తున్నారు. ప్రజా పాత్రికేయుల మీద ఊహించని రీతుల్లో విపరీ తమైన ఒత్తిడి పెంచుతున్నారు. స్వేచ్ఛగా నిజాలు రాయడానికి, పాలక పక్ష ప్రజాస్వామ్య, రాజ్యాంగ, ప్రజావ్యతిరేక విధానాలను, భావజాల, సాంస్కృతిక దుర్మార్గాలను ప్రస్తావించడానికి కూడా జంకే విధంగా పరిస్థితులు తీసుకొస్తున్నారు. జన సామాన్యానికి అవసరమైన ప్రజా పాత్రికేయులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరిది. రాజ్యాంగమిచ్చిన పాత్రికేయ రక్షణకు ప్రజాసంఘాలు, పౌర హక్కుల వేదికలు, ప్రత్యామ్నాయ పార్టీలు కూడా పోరాడాలి.

/ వ్యాసకర్త సెల్‌ : 9490204545 /సంగిరెడ్డి హనుమంతరెడ్డి
/ వ్యాసకర్త సెల్‌ : 9490204545 /సంగిరెడ్డి హనుమంతరెడ్డి
➡️