ముంబయి : యానిమల్ సినిమాలు సమాజానికి చాలా ప్రమాదకరమని బాలీవుడ్ సీనియర్ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఔరంగాబాద్లో జరిగిన ‘అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ప్రస్తుత సినిమా పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని పరోక్షంగా యానిమల్ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు.
ఈ సినిమాలో ఒక సీన్లో హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ను బూట్లు నాకాలని అనడం, మరో సీన్లో మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైనదేనని చెప్పడం వంటి సన్నివేశాలు ఉన్నాయని, అయినప్పటికీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిందని అన్నారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా హిట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు.
సమాజం మెచ్చుకునేలా పాత్రలను రూపొదించడం కష్టంగా మారిందని, ఈ నాటి యువ చిత్ర నిర్మాతలకు ఇది పరీక్షా సమయమని తాను భావిస్తున్నానని అన్నారు. తెరపై హీరో పాత్రను ప్రెజెంట్ చేయడం రచయితలకు పెద్ద సవాలుగా మారింది. అలాగే సినిమాల్లో నైతిక విలువలు ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి సినిమాలు చూడాలి అనేది ప్రేక్షకులే నిర్ణయించుకోవాలని, ప్రస్తుతం బంతి ప్రేక్షకుల కోర్టులో ఉందని అన్నారు. సమాజంలో ఏది ఒప్పు మరియు ఏది తప్పు అనే దానిపై స్పష్టంగా ఉన్నప్పుడు గొప్ప పాత్రలు వస్తాయని, కానీ ప్రస్తుతం సమాజంలోనే గందరగోళం నెలకొందని అన్నారు.