హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియెరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో … సినిమా విడుదలపై డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తాను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు రామ్గోపాల్ వర్మ తెలిపారు. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో టిడిపి నేత నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల ఆలస్యమైంది. వ్యూహం సినిమాపై మరొకసారి ఒక కమిటీ సమీక్షించి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంతో విడుదలకు ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా విడుదల కానుంది.