గైక్వాడ్‌ సెంచరీభారత్‌ 222/3

Nov 28,2023 22:20 #Sports

గౌహతి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో టీమిండియా బ్యాటర్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. గౌహతిలోని బర్సపరా క్రికెట్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన మూడో టి20లో రుతురాజ్‌ గైక్వాడ్‌(123నాటౌట్‌; 57బంతుల్లో 13ఫోర్లు, 7సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(39), తిలక్‌ వర్మ(31నాటౌట్‌) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 223పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు డబుల్‌ షాకులు తాకాయి. గత రెండు మ్యాచ్‌లలో అదిరిపోయే ఆరంభాలిచ్చిన జైస్వాల్‌ (6).. బెరెన్‌డార్ఫ్‌ వేసిన రెండో ఓవర్లో వికెట్‌ కీపర్‌ వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే ఇషాన్‌ కిషన్‌ (0)ను కేన్‌ రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో కవర్స్‌ దిశగా ఆడబోయి స్టోయినిస్‌ చేతికి చిక్కాడు.గైక్వాడ్‌ సెంచరీ..తిలక్‌వర్మతో జతకట్టిన గైక్వాడ్‌ బ్యాట్‌ ఝుళిపించడం మొదలుపెట్టాడు. ఓవైపు తిలక్‌ వర్మ సింగిల్స్‌ తీస్తుంటే.. మరోవైపు గైక్వాడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేన్‌ రిచర్ద్‌సన్‌ వేసిన 12వ ఓవర్లో తిలక్‌ రెండు ఫోర్లు బాదగా.. గైక్వాడ్‌ ఓ బౌండరీ కొట్టాడు. హార్డీ వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన గైక్వాడ్‌ 33 బంతుల్లో అర్థసెంచరీ పూర్తిచేశాడు. అర్థసెంచరీ తర్వాత రుతురాజ్‌ మరింత రెచ్చిపోయాడు. సంఘా వేసిన 15వ ఓవర్లో 4, 6 కొట్టిన గైక్వాడ్‌.. హార్డీ వేసిన 18వ ఓవర్లో 6, 6, 4, 6తో మొత్తం 25పరుగులు రాబట్టాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఆఖరి ఓవర్లో ఫస్ట్‌ బాల్‌కే సిక్సర్‌ కొట్టి శతకం పూర్తిచేశాడు. అంతర్జాతీయ టి20లలో అతడికి ఇదే తొలి శతకం. 33 బంతుల్లో అర్థసెంచరీ చేసిన అతడు తర్వాత 19 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేయడం గమనార్హం. దీంతో టి20 ఫార్మాట్‌లో సెంచరీ కొట్టిన భారత ఆటగాళ్లలో ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. 20ఓవర్లో 30పరుగులతో రికార్డు..టి20 ఫార్మాట్‌లో చివరి ఓవర్లో 30పరుగులు సమర్పించుకొన్న బౌలర్‌గా మాక్స్‌వెల్‌ నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో రుతురాజ్‌ (6, 4(నోబాల్‌), 1, 1, వైడ్‌, 6, 6, 4) మూడు సిక్సర్లు, ఫోర్లు కొట్టాడు. నోబాల్‌, వైడ్‌తోపాటు మరో రెండు సింగిల్స్‌ రావడంతో ఆ ఓవర్లో ఏకంగా 30 పరుగులు వచ్చాయి. దీంతో భారత్‌ స్కోర్‌ 222పరుగులకే చేరింది. ఇంతకుముందు ఈ రికార్డు బ్రెట్‌ లీ(ఆస్ట్రేలియా) పేరిట 2009లో ఉంది. వెస్టిండీస్‌పై అతడు చివరి ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకోగా.. తాజాగా ఆ రికార్డును మ్యాక్స్‌వెల్‌ చెరిపేశాడు. స్కోర్‌బోర్డు… ఇండియా ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)వేడ్‌ (బి)బెహ్రెన్‌డార్ఫ్‌ 6, గైక్వాడ్‌ (నాటౌట్‌) 123, ఇషాన్‌ కిషన్‌ (సి)స్టొయినీస్‌ (బి)రిచర్డుసన్‌ 0, సూర్యకుమార్‌ (సి)వేడ్‌ (బి)హార్డి 39, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 31, అదనం 23. (20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 222పరుగులు. వికెట్ల పతనం: 1/14, 2/24, 3/81 బౌలింగ్‌: రికార్డుసన్‌ 3-0-34-1, బెహ్రెన్‌డార్ఫ్‌ 4-1-12-1, ఎల్లిస్‌ 4-0-36-0, సాంఘా 4-0-42-0, హార్డి 4-0-64-1, మ్యాక్స్‌వెల్‌ 1-0-30-0.

➡️