క్రికెట్లో ఐసీసీ కొత్త రూల్ను తీసుకువచ్చింది. ఐసీసీ తాజా నిర్ణయంతో బ్యాట్స్ మెన్కు ప్రయోజనం కలగనుంది. ఈ నిర్ణయం గతేడాది డిసెంబర్ 12 నుంచే అమలులోకి వచ్చినట్లు తెలిపింది. స్టంప్ ఔట్ అప్పీల్ విషయంలో ఫీల్డ్ అంపైర్ నుంచి అప్పీల్ వస్తే కేవలం స్టంప్ ఔట్ను మాత్రమే చెక్ చేసేలా నిబంధనలను మార్చింది.
కీపర్ స్టంప్ ఔట్కు అప్పీల్ చేసినపుడు ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ రిఫరెన్స్ కోరుతుంటారు. ఈ అప్పీల్ను పరిశీలించే క్రమంలో థర్డ్ అంపైర్ ముందు బంతి బ్యాట్ను తాకిందా లేదా అనేది చూస్తారు. ఒకవేళ బంతి బ్యాట్ను తాకితే క్యాచ్ ఔట్ ఇస్తారు. తాకకుంటే స్టంప్ ఔట్ అప్పీల్ను పరిశీలిస్తారు. ఒక్క అప్పీల్తో క్యాచ్, స్టంప్ ఔట్లు రెండింటినీ పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఐసీసీ తాజా నిర్ణయంలో స్టంప్ ఔట్ అప్పీల్ వచ్చినపుడు కేవలం స్టంపింగ్ను మాత్రమే పరిశీలించేలా రూల్స్ సవరించింది. క్యాచ్ ఔట్ కోసమైతే కీపర్ విడిగా అప్పీల్ చేసుకోవాలని ఐసీసీ తెలిపింది.