- ఎలక్టోరల్ బాండ్లు ఎన్నికల కుంభకోణం
- సిపిఎం రాజ్యసభ ఎంపి జాన్ బ్రిట్టాస్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పని చేయాల్సిన ఎన్నికల సంఘాన్ని పూర్తిగా లొంగదీసుకునేలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్ల నియామక బిల్లును కేంద్రప్రభుత్వం రూపొందించిందని సిపిఎం రాజ్యసభ ఎంపి జాన్బ్రిట్టాస్ విమర్శించారు. రాజ్యసభలో బిల్లుపై మంగళవారం జరిగిన చర్చలో సిపిఎం తరపున ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను పక్కనపెట్టడానికి, ఎన్నికల కమిషన్ను నియంత్రణలో ఉంచడానికి ఈ బిల్లు ఉద్దేశించబడిందని విమర్శించారు. కాశ్మీర్ తీర్పు తరువాత, ప్రభుత్వం సుప్రీంకోర్టును ప్రశంసించిందని, మరుసటి రోజు అదే కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తోందని విమర్శించారు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వు ఎన్నికల కమిషన్ విశ్వసనీయత, నిష్పాక్షికత, స్వతంత్రతను నిర్ధారించే లక్ష్యంతో ఉందన్నారు. ప్రభుత్వం దానిని తారుమారు చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్కు ప్రత్యేక కార్యాలయం అవసరమా? దాన్ని మూసేసి న్యాయమంత్రిత్వ శాఖలో పెడితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘాన్ని మరో ప్రభుత్వ శాఖగా మారుస్తున్నారని విమర్శించారు. ఇది రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలకు కారణమవుతుందని హెచ్చరించారు. దేశంలో ఎన్నికల రంగం ప్రస్తుతం డబ్బు, అధికారంతో నియంత్రించబడుతుందని విమర్శించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రూ.60 వేల కోట్ల ఖర్చు చేశాయని, ఇందులో సింహభాగం బిజెపి ఖర్చు చేసిందని తెలిపారు. 2024లో ఇది ఇంకా చాలా రెట్లు పెరుగుతుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ నిజానికి ఎన్నికల కుంభకోణమని, అసలు పారదర్శకంగా లేదని బ్రిట్టాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.