కిర్గిస్థాన్ : కిర్గిస్థాన్ దేశంలోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని నగరం బిషెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరు బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు అక్కడి భారతదేశ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ” మన విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికి, విద్యార్థులు బయటకు రావొద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి ” అంటూ 24 గంటలు అందుబాటులో ఉండే ఒక ఫోన్ నంబర్ (0555710041)ను షేర్ చేసింది. కిర్గిస్థాన్, ఈజిప్ట్కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసిందని తెలిపింది.