అమెరికా : అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని తీవ్ర మంచు తుపాను వణికిస్తోంది. అక్కడి జనజీవనం స్తంభిస్తోంది. తీవ్ర మంచు తుపాను కారణంగా రోడ్లన్నీ దాదాపు అడుగుమేర మంచుతో కప్పబడి మూసుకుపోయాయి. ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో పాఠశాలలు మూతపడ్డాయి. న్యూయార్క్, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ తుపాను కారణంగా పెన్సిల్వేనియాలో ఒక స్నోమొబైలర్ మృతి చెందాడు. ఈ రాష్ట్రంలో 1,50,000 కుటుంబాలకు కరెంటు సరఫరా ఆగిపోయింది. గత రెండేళ్లలో ఇలాంటి మంచు తుపాన్ను చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
న్యూయార్క్, బోస్టన్లలో దాదాపు 1,200 విమానాలు రద్దు…
పెన్సిల్వేనియా నుంచి మస్సాచుసెట్స్ వరకు ఉన్న పట్టణాల్లో మంగళవారం ఉదయం నుంచే మంచు భారీగా కురవడం ప్రారంభమైంది. దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కనెక్టికట్లోని ఫర్మింగ్టన్ పట్టణంలో దాదాపు 15.5 అంగుళాల మేర మంచు కురిసింది. ఈశాన్య అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించడాన్ని అధికారులు నిషేధించారు. న్యూయార్క్, బోస్టన్లలో దాదాపు 1,200 విమానాలు రద్దయ్యాయి. మరో 2,700 విమాన సర్వీసుల్లో జాప్యం ఏర్పడింది. న్యూయార్క్ నగరంలో 744 రోజుల తర్వాత మంచు కురిసింది. ఇక్కడ 2.5 అంగుళాల మేర హిమపాతం నమోదైంది.