దుబాయి : ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం ఇజ్రాయిల్కి చెందిన నౌకను సీజ్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఎంసిఎస్ ఎరైస్ పేరు కలిగిన ఓ కంటెయినర్ నౌకను సెపా (గార్డ్స్) ఇరాన్ నేవీ స్పెషల్ ఫోర్సెస్ హెలిబోర్న్ ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్నాయని ఐఆర్ఎన్ఎ స్టేట్ న్యూస్ ఏజన్సీ తెలిపింది. ఈ ఆపరేషన్ హర్మౌజ్ జలసంధి సమీపంలో జరిగిందని, ఇరాన్ ప్రాదేశిక జలాలవైపుకు మళ్లించినట్లు ప్రకటించింది.
హర్మౌజ్ జలసంధిలో కమాండోస్ హెలికాఫ్టర్ ద్వారా నౌకను వెంబడిస్తున్న వీడియో ఒకటి అసోసియేటెడ్ ప్రెస్ షోస్ విడుదల చేసింది.
ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సిందే : ఇజ్రాయిల్ సైన్యం
ఈ ప్రాంతంలో వివాదాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వుంటుందని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరించింది. ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వుంటుందని ఇజ్రాయిల్ మిలటరీ ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ఇజ్రాయిల్ అప్రమత్తంగా ఉందని అన్నారు. ఇరానీయుల దురాక్రమణ నుండి ఇజ్రాయిల్ను రక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, స్పందించనున్నామని ప్రకటించారు.