జాతీయ పార్టీ కార్యాలయానికి వచ్చేందుకు ఆంక్షలా?
పోలీసుల చర్యపై ఆప్ మంత్రుల ఆగ్రహం
బిజెపి ఖాతాలో మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు
నడ్డాను అరెస్ట్ చేయాలి: అతిషి
కేజ్రీవాల్ పిటిషన్పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన తర్వాత ఆప్ నేతల నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీ లక్ష్యంగా ఆప్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎక్కడికక్కడే ఆందోళనలు జరుగుతున్నాయి. ఆప్ మంత్రులను అధికార నివాసాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు అడ్డుకోవడం సరికాదని అన్నారు.. ‘మిస్టర్ మోడీ మమ్మల్ని కాల్చేయండి’ అంటూ సౌరభ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఢిల్లీలో రౌడీయిజం మొదలైంది. పోలీసుల చర్యలో అర్థమవుతోంది. ఇక్కడ శాంతి భద్రతలు అమల్లో లేవు. మీరు మమ్మల్ని పార్టీ ఆఫీసు వెళ్లేందుకు అడ్డుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో తాము ఎలా పోటీ చేయాలి..? తమను నియంత్రించే అధికారం పోలీసులకు ఎక్కడిది? తమ పార్టీ నేతలపై జరుగుతున్న వివక్ష గురించి కేంద్ర ఎన్నికల సంఘం కలుగజేసుకోవాలి. ఇదే అంశం గురించి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరాం. ఢిల్లీలో పోలీసుల దూకుడుపై ఈసి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం అని’ సౌరభ్ భరద్వాజ్ అన్నారు. పార్టీ కార్యాలయానికి సీల్ వేయడం ఏంటీ అని మంత్రి అతిషి మండిపడ్డారు. ఇది రాజ్యాంగాన్ని విస్మరించడమేనని విరుచుకుపడ్డారు. ఓ జాతీయ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చేందుకు ఆంక్షలు విధిస్తారా..? ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘాన్ని సమయం కోరామని అన్నారు.
కేజ్రీవాల్ పిటిషన్ అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరారు. తన అరెస్టు చట్ట విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. హౌలీ పండుగ నేపథ్యంలో ఈ నెల 26 వరకు కోర్టుకు సెలవులు. గనుక బుధవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది.
బిజెపి ఖాతాలో మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు: నడ్డాను అరెస్ట్ చేయాలి
మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు బిజెపి ఖాతాలోకి వెళ్లిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఎలక్టోరల్ బాండ్లుగా ఆయన నుంచి కోట్లాది డబ్బు తీసుకున్న బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను అరెస్ట్ చేయాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితోపాటు దర్యాప్తు సంస్థల తీరుపై ఆమె మండిపడ్డారు. ఈ కేసుపై రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్న సిబిఐ, ఈడి ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన ఏ ఆప్ నాయకుడి నుంచి డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించలేకపోయాయని అతిషి తెలిపారు. ఈ రెండేళ్లలో మనీ జాడ ఎక్కడీ డబ్బు ఎక్కడికి పోయింది? అన్న ప్రశ్నలు మళ్లీ మళ్లీ వస్తున్నాయని అన్నారు. ఆప్కు చెందిన ఏ నేత, మంత్రి, కార్యకర్త నుంచి ఎలాంటి డబ్బును దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోలేదని ఆమె గుర్తు చేశారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో గత ఏడాది నవంబర్లో ఈడీ అరెస్ట్ చేసిన అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రా రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్ను తాను ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్తో తనకు ఎలాంటి సంబంధం లేదని శరత్ చంద్రారెడ్డి గతంలో స్పష్టంగా చెప్పారన్నారు. అయితే చాలా కాలం జైలులో ఉన్న తర్వాత అప్రూవర్గా మారిన ఆయన తన స్టేట్మెంట్ను మార్చారని ఆమె ఆరోపించారు.
మరోవైపు లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన డబ్బు ఎక్కడుంది? ఆ మనీ జాడ ఎక్కడీ అని మంత్రి అతిషి ప్రశ్నించారు. ఆ డబ్బు బిజెపి బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందని ఆమె ఆరోపించారు. ‘ఆయన (శరత్ చంద్రా రెడ్డి) రూ. 4.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బిజెపికి ఇచ్చాడు. ఆ తరువాత రూ. 55 కోట్ల విలువైన బాండ్లను కూడా ఇచ్చాడు. లిక్కర్ స్కామ్ నిందితుడి డబ్బులు బిజెపి ఖాతాలో కనిపించాయి. ప్రధాని మోడీ, ఈడికి నేను సవాల్ చేస్తున్నా. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను అరెస్టు చేయాలి’ అని అతిషి డిమాండ్ చేశారు.
గుజరాత్ ఇంచార్జ్, ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై ఇడి దాడి
ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఇంటిపై ఈడి దాడి చేసింది. ప్రస్తుతం ఈడి అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈడీ దాడులపై ఆప్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్షాన్నే జైలుకు పంపించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు దేశ ప్రజలకే కాదు మొత్తం ప్రపంచానికి అర్ధమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ దేశం రష్యా అడుగు జాడల్లో నడుస్తున్నదని, ఇదే విధంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఉత్తర కొరియాలో కూడా జరిగిందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల ప్రాథమిక హక్కుల హననంతోపాటు ప్రతిపక్షాలను అంతమొందించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రస్తుతం నియంతృత్వంలోకి వెళ్తున్నదని విమర్శించారు. ఓ అక్రమ కేసులో తమ పార్టీ చెందిన నలుగురు అగ్రనాయకులు ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్పారు. తాము గుజరాత్లోని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి ఇంచార్జ్గా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్పై ఈడి దాడులు నిర్వహిస్తున్నదని విమర్శించారు. ఇలాగే మౌనంగా ఉంటే ఆప్తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులపై దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఆ పోలీసు అధికారి నాతో దురుసుగా ప్రవర్తించాడు: కేజ్రీవాల్
ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఢిల్లీ సిఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గతంలో కోర్టు ఆవరణలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్ల దురుసుగా ప్రవర్తించింది కూడా ఈ పోలీసు అధికారే అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను తన భద్రతా వలయంలోని సిబ్బంది నుంచి తొలగించాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో రిమాండ్ దరఖాస్తుపై విచారణ నిమిత్తం ఈడి అధికారులు కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకె సింగ్ తనతో దురుసుగా ప్రవర్తించారని దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే ఈడి సిబ్బంది మాత్రం తనతో మర్యాదగానే వ్యవహరించారని వెల్లడించారు. కాగా, గతేడాది ఇదే కోర్టు ఆవరణలో విలేకరులు సిసోడియాను ప్రశ్నిస్తున్న సమయంలో ఎకె సింగ్ తన మెడ పట్టుకుని బలవంతంగా నెట్టారు. దీనిపై సిసోడియా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎకె సింగ్ చర్యను ఢిల్లీ పోలీసులు సమర్థించారు.