- ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు
- పలు బ్యాంకుల ప్రకటన
ముంబయి : క్రెడిట్ కార్డుల వినియోగించినప్పుడు లభించే ప్రోత్సాహక రివార్డులకు బ్యాంకులు కోత విధించనున్నాయి. ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశాయి. రివార్డులతో పాటు, ఎయిర్పోర్టు లాంజ్ యాక్సేస్ వంటి సేవలను కూడా కుదించనున్నాయి. కొత్త మార్పుల ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బిఐ ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై ఇస్తున్న రివార్డు పాయింట్లను నిలిపివేయనుంది. ఎస్బిఐ కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్పై వీటి ప్రభావం పడనుంది. అలాగే విమానశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ విషయంలో ఐసిఐసిఐ బ్యాంకు మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం..ఈ సదుపాయం పొందాలంటే కార్డు ద్వారా మూడు నెలల్లో కనీసం రూ.35 వేలు ఖర్చు చేయాల్సివుంటుంది. కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసిఐసిసి ప్లాటినం కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. యస్ బ్యాంక్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ తరహాలోనే నిబంధనలు సవరించింది. గడిచిన త్రైమాసికంలో కార్డు ద్వారా కనీసం రూ.10 వేలు ఖర్చు చేసినవారికే లాంజ్ యాక్సెస్ సదుపాయం వర్తిస్తుందని యస్ బ్యాంకు తెలిపింది. ఇక యాక్సిస్ బ్యాంకు అందిస్తున్న మాగస్ క్రెడిట్ కార్డుపై రివార్డు పాయింట్లను, లాంజ్ యాక్సెస్, వార్షిక ఛార్జీల విషయంలో మార్పులు చేసింది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.