ఢిల్లీలో కదంతొక్కిన విద్యార్థిలోకం

Jan 13,2024 08:32 #New Delhi, #parlament march

– విద్యారంగాన్ని బిజెపి నిర్వీర్యం చేసిందని ఆందోళన

– ఎన్‌ఇపిని తిరస్కరించాలని, బిజెపిని ఓడించాలని పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వినాశకర విధానాల వల్ల దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని, రాబోయే ఎన్నికల్లో బిజెపిని తిరస్కరించాలని దేశంలోని విద్యార్థి లోకానికి 16 విద్యార్థి సంఘాల నేతలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. ‘దేశాన్ని రక్షించాలంటే, బిజెపిని ఓడించాలి. విద్యను పరిరక్షించాలంటే, నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి)ని తిరస్కరించాలి’ అంటూ విద్యార్థులు గర్జించారు. అఖిల భారత స్థాయిలో ఏర్పాటైన స్టూడెంట్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీ వీధుల్లో ‘చలో పార్లమెంటు మార్చ్‌’ చేపట్టారు. దేశ నలుమూలాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ మార్చ్‌కు తరలివచ్చారు. బృందాలుగా బారులు తీరిన విద్యార్థులు ‘ప్రభుత్వ విద్యను కాపాడాలి.. విద్యా ప్రయివేటీకరణ, కాషాయికరణ, కార్పొరేటీకరణ ఆపాలి’ అని నినదించారు. ఉచిత నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలు చేయాలని, విద్యా సంస్థల్లో మతోన్మాద చర్యలు ఆపాలని డిమాండ్‌ చేశారు. విద్యా సంస్థల స్వతంత్రతను పరిరక్షించుకుందాం అంటూ నినదించారు. ఎన్‌ఇపి, సియుఇటి వంటి క్రూరమైన విద్యా విధానాలను వెనక్కి తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ సహా 16 విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఈ మార్చ్‌లో పాల్గన్నారు. ఐక్య విద్యార్థి మార్చ్‌ను అడ్డుకునేందుకు బిజెపి ప్రభుత్వం అడ్డుకునేందుకు విఫలయత్నం చేసింది. బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి ఈ మార్చ్‌కు బయల్దేరిన విద్యార్థులను అక్కడే పోలీసులు అరెస్టు చేసి అడ్డుకున్నారు. ఈ ర్యాలీకి రాకుండా ఆంక్షలు విధించాలని, అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలని విశ్వవిద్యాలయాల యాజమాన్యాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా విశ్వవిద్యాలయాలు విద్యార్థులపై ఆంక్షలు విధించింది. ఈ నిర్బంధ చర్యలన్నిటిని అధిగమించి వేలాది మంది విద్యార్థులు మార్చ్‌కు తరలిరావడం విశేషం. ఈ పార్లమెంటు మార్చ్‌కు విపి సాను, మయూఖ్‌ బిశ్వాస్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), శ్రీరంగరాజ్‌ (ఎఐఎస్‌ఎఫ్‌), సౌమ్యదీప్‌ సర్కార్‌ (ఎఐఎస్‌బి), ప్రియాంక భారతి (సిజెఆర్‌డి), అనురాగ్‌ నిగమ్‌ (సివైఎస్‌ఎస్‌), ప్రిన్స్‌ ఎన్నారెస్‌ పెరియార్‌ (ద్రవిడియన్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌), అనఘ ప్రదీప్‌ (డిఎస్‌ఎఫ్‌ కార్యదర్శి), చిన్న తంబి (ఎన్‌ఎస్‌ యుఐ), రాందాస్‌ ప్రిని శివానందన్‌ (పిఎస్‌ఎఫ్‌), నౌఫల్‌ సైఫుల్లా (పిఎస్‌ యు), అమన్‌ పాండే (ఆర్‌ఎల్డి ఛత్రసభ), ఇమ్రాన్‌ (సమాజ్‌వాదీ ఛత్రసభ), దేవబ్రత సైకియా (సత్రో ముక్తి సంగమ సమితి), సుజిత్‌ త్రిపుర (టిఎస్‌యు) తదితరులు నేతృత్వం వహించారు.విద్యా వ్యతిరేక విధానాలను సహించం : విపి సానుజంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన ప్రదర్శనకు ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను, మతపరమైన మార్గాల్లో విభజించడమే బిజెపి అజెండా, అందుకనే విద్యా రంగాన్ని కాషాయీకరణ చేసేందుకు మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు. లౌకిక, ప్రజాస్వామ్య, సమాఖ్య వాదాలను అణిచేసేందుకు కుట్ర సాగుతోందని, దుర్మార్గమైన ఈ చర్యలను విద్యార్థిలోకం అంగీకరించబోదని తెలిపారు. ఫిబ్రవరి 1న చెన్నైలో మహాప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. ‘రాముడు’ పేరిట బిజెపి దేశాన్ని దోచుకుంటోందని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిశ్వాస్‌ విమర్శించారు. ఎన్‌ఇపి వంటి వినాశకర విధానాలతో విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తుందన్నారు. ఫెలోషిప్‌, ఉపకారవేతనాల రద్దుతో పేదలకు విద్యను దూరం చేసేందుకు మోడీ సర్కార్‌ కుట్ర పన్నుతోందని విమర్శించారు. ఎన్‌ఇపి, బిజెపి దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యామ్నాయ విద్యా విధానాల ఆవశ్యకతను ఎఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి దినేష్‌ శ్రీరంగరాజ్‌ వివరించారు. ఎఐఎస్‌ఎ ప్రధాన కార్యదర్శి ప్రసేన్‌జిత్‌ బోస్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థులు బిజెపికి వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను ఆత్మహత్యలకు పురికొల్పే నీట్‌ పరీక్షను నిలిపివేయాలని డిఎంకె విద్యార్థి విభాగం నేత, ఎమ్మెల్యే ఎజిలరసన్‌ డిమాండ్‌ చేశారు.ఐక్య విద్యార్థి మార్చ్‌ డిమాండ్లు ఇవీ..చలో పార్లమెంటు మార్చ్‌ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలు పలు డిమాండ్లను ముందుకు తెచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి దీప్సితా ధర్‌ డిమాండ్‌ చార్టర్‌ను ర్యాలీలో చదివి వినిపించారు. అవి : ా ఫీజుల పెంపును ఉపసంహరించాలి. పిజి వరకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలి. ా విద్యా సంస్థలో కుల, మత, సామాజిక వివక్షలను నిరోధించేందుకు రోహిత్‌ చట్టాన్ని తీసుకురావాలి. విద్య, ఉపాధిలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఇతర అట్టడుగున ఉన్న వర్గాల హక్కులు, అవకాశాలు పరిరక్షించాలి. ప్రయివేటు విద్యా, ఉపాధి రంగంల్లోనూ రిజర్వేషన్లు అమల్జేయాలి. ా అందరికీ విద్య, ఉపాధి హామీ కోసం భగత్‌సింగ్‌ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలి. ా విద్యా సంస్థల్లో అన్ని రకాలుగా లింగ వివక్ష లేకుండా చేయాలి. లైంగిక వేధింపులు జరగకుండా చూడాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని విద్యా సంస్థల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి. ా విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘ ఎన్నికలను నిర్వహించాలి. విద్యార్థి సంఘం ప్రజాస్వామిక హక్కులను నిర్ధారించాలి. అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి.

➡️