కేజ్రీవాల్‌కు మరోసారి ఇడి సమన్లు

Mar 17,2024 11:10 #Arvind Kejriwal, #ED summons
  •  ఇది మరో తప్పుడు కేసు : ఆప్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఆదివారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్‌కు ఇడి సమన్లు జారీ చేయడం వరుసగా ఇది తొమ్మిదోసారి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేజ్రీవాల్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు తొమ్మిదవసారి సమన్లు జారీ చేసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో సమన్లకు కేజ్రీవాల్‌ స్పందించడం లేదంటూ ఢిల్లీ కోర్టులో ఇడి రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. ఈ ఫిర్యాదులపై విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ కోర్టు ముందు శనివారం హాజరయ్యారు. చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. ఆ మరుసటి రోజే ఇడి తొమ్మిదోసారి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేయడం గమనార్హం. ఇదే కేసులో బిఆర్‌ఎస్‌ నేత కె.కవితను రెండు రోజుల క్రితం ఇడి అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆప్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజరుసింగ్‌, విజరు నాయర్‌లను ఇడి అరెస్టు చేసింది.
కేజ్రీవాల్‌పై మరో తప్పుడు కేసు : ఆప్‌ మంత్రి అతిషీ
కేజ్రీవాల్‌పై మరో తప్పుడు కేసు బనాయించారని ఆప్‌ మంత్రి అతిషీ మండిపడ్డారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మద్యంకేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయలేమని భావించిన కేంద్రం ఇప్పుడు మరో తప్పుడు కేసుతో కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగానే తాజాగా సమన్లు జారీ చేసిందని విమర్శించారు. కేజ్రీవాల్‌కు శనివారం సాయంత్రం ఇడి నుండి మరోసారి సమన్లు అందాయని, ఢిల్లీ జల్‌ బోర్డ్‌కు సంబంధించిన కేసులో మార్చి 21న ఇడి కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొన్నారని తెలిపారు. ఈ కేసు గురించి ఎవరికీ తెలియదని, ఇదో తప్పుడు కేసని అతిషీ పేర్కొన్నారు.

➡️