Delhi: 60కు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు ..

May 1,2024 11:32 #Bomb Threat, #Delhi Schools

న్యూఢిల్లీ :    ఢిల్లీలో బాంబుల బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఈ మెయిల్స్‌ ద్వారా సుమారు 60కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అన్నారు. ముందుగా చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్‌, మయూర్‌ విహార్‌లోని మదర్‌ మేరీ స్కూల్‌, ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కి బెదిరింపులు వచ్చాయని, అనంతరం ఢిల్లీతో పాటు నొయిడాలోని సుమారు 60కి పైగా పాఠశాలలకు ఈ మెయిల్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ పాఠశాలల్లో ఒకటైన మదర్‌ మేరీ స్కూల్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈమెయిల్‌ రావడంతో పరీక్షను నిలిపివేశారు. తక్షణమే క్యాంపస్‌ను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. తమ పిల్లలను తీసుకువెళ్లాల్సిందిగా తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

” బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో తగిన చర్యలు తీసుకున్నాం. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. తల్లిదండ్రులు భయపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ” అని ఢిల్లీ పోలీస్‌ ప్రతినిధి తెలిపారు.

భయాందోళనలు సృష్టించేందుకు ఒకే ఈ-మెయిల్‌ను పలు పాఠశాలలకు పంపారని, ఈ-మెయిల్‌ ఐపి అడ్రస్‌ను గుర్తించేందుకు సైబర్‌ పోలీసులు యత్నిస్తున్నారని అన్నారు.

➡️