నీలగిరి (తమిళనాడు) : లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా … ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని సోదా చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ను అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడులోని నీలగిరిలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని నీలగిరి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎ.రాజాకు మద్దతుగా రాహుల్ గాంధీ సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహించారని పోలీసులు తెలిపారు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ సోదాలు జరిగాయి. ఇందులో ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రచారం ముగించుకుని తన పార్లమెంటరీ నియోజకవర్గం కేరళలోని వయనాడ్కు వెళ్లారు. అక్కడ బహిరంగ సభతో సహా ప్రచార కార్యకలాపాల్లో పాల్గొన్నారు. వయనాడ్ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. వయనాడ్ నుంచి రెండోసారి పోటీలో ఉన్న ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు.