న్యూఢిల్లీ : పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్ లఖ్బీర్సింగ్ లాండాను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. 34 ఏళ్ల లఖ్బీర్సింగ్ లాండా పంజాబ్లోని తరన్తరణ్ జిల్లాలోని హరికేకి చెందినవారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. లఖ్బీర్సింగ్ ప్రస్తుతం కెనడాలోని ఎడ్మోంటన్లో నివశిస్తున్నారు. ఇతను బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థలో సభ్యుడు. లఖ్బీ గతంలో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. మొహాలీలోని పంజాబ్ స్టేట్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యలయంపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనైడ్ విసిరిన ఉగ్రదాడిలో పాల్గొన్నాడని కేంద్రమంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అలాగే అతను పంజాబ్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి సరిహద్దుల నుండి వివిధ ప్రాంతాలకు ఐఇడిలు, ఆయుధాలు, పేలుడు పరికరాలను సరఫరా చేయడంలో కూడా పాల్గొన్నాడని హోం శాఖ ప్రకటన తెలిపింది. లాండాపై ఓపెన్-ఎండ్ వారెంట్ను జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన పేర్కొంది. కాగా, కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ను హతమార్చడంలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ట్రూడో వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. నిజ్జర్ హత్యానంతరం కెనడా- భారత్ల మధ్య దౌత్య సంబంధాలు మెరుగ్గా లేవు.