రాంచీ : జార్ఖండ్లోని చంపారు సోరెన్ ప్రభుత్వంలోని కొత్త కేబినెట్పై కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లయితే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది మా డిమాండ్.’ అని అన్నారు. ఇక కేబినెట్ విస్తరణలో తమ ఎమ్మెల్యేలకు చోటు దక్కకపోవడంపై మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనూప్ సింగ్ మాట్లాడుతూ.. ‘మేము మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. మేము అనుకుంటున్నది మా పిసిసి అధ్యక్షుడికి లేఖ ద్వారా పంచుకున్నాము. అయినప్పటికీ మా డిమాండ్ అలానే ఉంది’ అని ఆయన అన్నారు. ఇక చంపారు సోరెన్ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం అనంతరం జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు చెప్పిన అంశంపై పార్టీలో చర్చిస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రివర్గంలో షెడ్యూల్డ్ కులానికి చెందిన సభ్యుడిని చేర్చుకోకపోవడంపై బిజెపి ఎంపి నిషికాంత్ దూబే చంపారు సోరెన్ ప్రభుత్వాన్ని నిందించారు.
కాగా, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపారు సోరెన్ మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు. హోం శాఖను తన వద్దే ఉంచుకున్నారు. జెఎంఎం నేతలు మిథిలేష్ కుమార్ ఠాకూర్, బసంత్ సోరెన్, మాజీ సిఎం హేమంత్ సోరెన్ సోదరుడు హఫీజుల్ హసన్, బేబి దేవి, దీపక్ బీరువా, కాంగ్రెస్ నుంచి రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్లు రాజ్భవన్లో శుక్రవరం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.