సందేశ్‌ ఖలీ బాధితులకు న్యాయం చేయండి!

Mar 8,2024 10:15 #Sandesh Khali!, #TMC

వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌

తృణమూల్‌, బిజెపి పోషించిన గ్యాంగ్‌ లీడరే షాజహాన్‌

 వ్యకాస ప్రధానకార్యదర్శిబి వెంకట్‌ విమర్శ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పర్గణ జిల్లాలో సందేశ్‌ ఖలీ ప్రాంతం అరాచక శక్తులకు కేంద్రంగా మారిందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ అన్నారు. సందేశ్‌ ఖలీ ప్రాంతంలో అరాచకాలకు గురైన గిరిజన ప్రజలను విచారించి వారి బాధలను పరిశీలించి వారికి మనోధైర్యం కల్పించేందుకు వెళ్లిన వ్యవసాయ కార్మిక సంఘం బృందంలో వెంకట్‌తోపాటు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు తుషార్‌ ఘోష్‌, అమియా పాత్ర తదితరులు ఉన్నారు. ఈ బృందం ముందు బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. 2011 నుంచి సందేశ్‌ ఖలీ ప్రాంతంలో నిరుపేద గిరిజనులు ఎదుర్కొంటున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలోని ఐదు పంచాయతీలను 2011 నాటికి లెఫ్ట్‌ ఫ్రంట్‌ గెలిచిందని, తృణముల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నామినేషన్‌ వేసే అవకాశం కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని వారు తెలిపారు. ఈ అరాచక గుంపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ శాసన సభ్యులు, గిరిజన ప్రజల నేత నిరాపత్‌ సర్దార్‌కు, వారి బృందానికి అభినందనలు తెలియజేసే కార్యక్రమం వ్యవసాయ కార్మిక సంఘం బుధ, గురువారాల్లో కోల్‌కతాలో నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మమతా బెనర్జీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు సృష్టించిన అరాచక గ్యాంగులు బెంగాల్‌ రాష్ట్రం అంతా అకృత్యాలకు తెగబడుతున్నాయని అన్నారు. గత వామపక్ష ప్రభుత్వం పేదలకు భూములు పంచి వారి జీవితాలకు, భవిష్యత్తుకు భద్రతను కల్పించగా, మమత అధికారంలోకి రాగానే అరాచక శక్తుల చేతుల్లోకి అధికారం చేరిందని, కేంద్రంలోని బిజెపి అండదండలతో విచ్చలవిడి భూ ఆక్రమణలు, కబ్జాలకు టిఎంసి పార్టీ నేతలు తెగబడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాలను అడ్డుకున్న వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ సాగించారని, వారి అరాచకాలను ప్రశ్నించిన మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇటువంటి అరాచక గుంపును ఆసరా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందే దాని కోసం ఇటు తృణమూల్‌ కాంగ్రెస్‌, అటు బిజెపి ప్రభుత్వాలు చట్టపట్టాలేసుకుని సాగాయని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడుతున్న స్థితిలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం బిజెపి, టిఎంసి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ అరాచకాలకు పాల్పడుతున్న షేక్‌ షాజహాన్‌ను నిలువరించేందుకు కానీ, అరెస్టు చేసేదానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టులు తీవ్రంగా మందలించి, హెచ్చరించిన తర్వాత మాత్రమే ఆ నిందితున్ని అరెస్ట్‌ చేయటం, కేసును సిబిఐకి అప్పగించడం జరిగిందని అన్నారు. దోషులను అరెస్టు చేయడం చేతగాని ప్రభుత్వం వారి దౌర్జన్యాలను అడ్డుకుంటున్న గిరిజన నేత, మాజీ శాసనసభ్యులు నిరాఫర్‌ సర్దారుపై భౌతికదాడులు చేసి అక్రమంగా అరెస్టు చేసి బెయిల్‌ కూడా రాకుండా అమానుషంగా 20 రోజులపాటు జైల్లో నిర్బంధించారని అన్నారు. ఈ చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు టిఎంసి ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన తర్వాతనే నీరా సర్దార్ని విడుదల చేయడం, అరాచక గ్యాంగ్‌ లీడర్‌ షాజహాన్‌ అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. సందేశ్‌ ఖలీలో జరుగుతున్న ఈ అరాచకాలను వాటిని ఎదుర్కొంటున్న పేదలను ఆసరా చేసుకుని, అల్లర్లను మరింత పెంచి బెంగాల్లో హిందూమత ఉన్మాదాన్ని రగిలించేందుకు బిజెపి కుట్రలు, కుయుక్తులకు పాల్పడుతున్నదని అన్నారు.

బిజెపి ఉన్మాద చర్యలను బెంగాల్‌ ప్రజలు హర్షించరని, కచ్ఛితంగా తిప్పి కొడతారని ఆయన అన్నారు. బెంగాల్‌ ప్రజలు ప్రజాస్వామిక వాదులని, బిజెపి, తృణమూల్‌ అరాచకాలు ఎదురొడ్డి ప్రజాస్వామ్య వాతావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వాతావరణం కోసం పోరాడుతున్న బాధితులకు అండగా వ్యవసాయ కార్మిక సంఘం విస్తృతంగా రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయబోనుకున్నదని అన్నారు. 25 లక్షల మంది ప్రజలను కలవాలని, గ్రామ గ్రామాన జనరల్‌ బాడీ సమావేశాలు జరపాలని, బాధితులకు అండగా ప్రజాతంత్ర వాదులందరినీ సమీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

➡️