గాంధీనగర్ : బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో 11 మంది దోషులు లొంగిపోవడంపై తమకు సమాచారం అందలేదని దాహోద్ పోలీసులు తెలిపారు. అయితే శాంతి భద్రతల పరిరక్షణ కోసం వారు నివసించే ప్రాంతాలలో పోలీస్ బలగాలను మోహరించామని అన్నారు. 11 మంది నిందితుల రెమిషన్ కల్పించాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా తిరిగి వారిని జైలుకి తరలించాలని ఆదేశించింది. దోషులు అజ్ఞాతంగా వెళ్లినట్లు కాదని, వారిలో కొందరు బందువులను కలిసేందుకు వెళ్లారని దాహోద్ పోలీస్ సూపరింటెండెంట్ బలరామ్ మీనా తెలిపారు. ”వారు లొంగిపోవడానికి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం అందలేదు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ మాకు అందలేదు. దోషులు స్థానికంగా సింగ్వాడా తాలుకాలో ఉంటున్నారు. తీర్పు వెలువడే ముందు శాంతిభద్రతలను కాపాడటానికి , మత ఘర్షణలు చెలరేగకుండా చూసేందుకు సోమవారం ఉదయం నుండి ఇక్కడ భారీగా పోలీసులను మోహరించాం” అని అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/Dahod-SP.jpg)