ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లపై కేంద్రానికి నోటీసులు

భోపాల్‌ :  ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లపై కేంద్రానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు  ఆదివారం  నోటీసులిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్‌ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌లు వర్తిస్తాయా అని హైకోర్టు   కేంద్రాన్ని ప్రశ్నించింది.  ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా వర్తిస్తాయా, లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ చీఫ్‌ జస్టిస్‌ రవి విజయమలిమత్‌, జస్టిస్‌ విశాల్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఆరు వారాల్లో స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.

ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ల వర్తింపుపై ‘అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌’ సంస్థ మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్‌లు వర్తించడం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొంది. పేదలపై కులం పేరుతో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, రాజ్యాంగ విరుద్ధంగా భావించి ఈ రిజర్వేషన్లను కొట్టి వేయాలని కోర్టును కోరింది.

➡️