ఫొటోలు, వీడియోలు మాత్రమే సాక్ష్యం కావు : ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరిగిపోతోంది.. డీప్‌ ఫేక్‌ ఫొటోలే అసలైన ఫొటోలుగా చలామణి అవుతున్న రోజుల్లో ఫొటోలు, వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఫొటోలు, వీడియోలు ఇస్తే సరిపోదు.. అవి నిజమైనవేననే ఆధారాలను కూడా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈమేరకు ఓ జంట విడాకుల కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య, ఐదేళ్ల కూతురుకు కలిపి నెలనెలా రూ.75 వేలు భరణం కింద చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది. అయితే, తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది కాబట్టి తాను ఎలాంటి భరణం చెల్లించాల్సిన అవసరంలేదని భర్త వాదించారు. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేశాడు. భార్య వివాహేతర సంబంధానికి సాక్ష్యంగా ఫొటోలను కోర్టుకు సమర్పించాడు. ఈ కేసును జస్టిస్‌ రాజీవ్‌ షక్దర్‌, జస్టిస్‌ అమిత్‌ బన్సల్‌ ల ధర్మాసనం విచారించింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త సమర్పించిన ఫొటోలు స్పష్టంగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, డీప్‌ ఫేక్‌ ఫొటోల బెడద నేపథ్యంలో ఆ ఫొటోలను సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మరింత స్పష్టమైన ఫొటోలు, అవి నిజమైనవేననే ఆధారాలతో కోర్టుకు అందజేస్తే పరిశీలిస్తామని పేర్కొంది.

➡️