- క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 విడుదల
- టాప్ 500లో 69 భారతీయ విశ్వవిద్యాలయాలు
న్యూఢిల్లీ : 69 భారతీయ విశ్వవిద్యాలయాలు (యూనివర్శిటీలు) తాజాగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లోకి ప్రవేశించాయి. 55 సబ్జెక్టులలో మొత్తం 424 విశ్వవిద్యాలయాలు ఎంట్రీలు అయ్యాయి. ప్రపంచ ఉన్నత విద్యా నిపుణులచే రూపొందించబడిన జాబితాలో 101 సంస్థలు ఉన్న చైనా తర్వాత భారతదేశం ఆసియాలో రెండవ అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా నిలిచింది. ఈ సంవత్సరం మొత్తం భారతీయ ఎంట్రీలలో అత్యధికంగా 72 శాతం మంది జాబితాలోకి కొత్తవారు, వారి స్థానాలను మెరుగుపరుచుకున్నవారు లేదా కొనసాగించినవారుగా ఉన్నారు. కేవలం 18 శాతం మంది ప్రదర్శన క్షీణించింది. 16,400 యూనివర్సిటీలు నిర్వహించిన కార్యక్రమాలు, 95 దేశాలు, ద్వీపాలలోని 1,500 యూనివర్సిటీలలో విద్యార్ధులు చేసిన కార్యక్రమాలు, అకాడమీ క్రమశిక్షణ, ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్, నేచ్యురల్ సైన్సు అండ్ సోషల్ సైన్స్ వంటి ఐదు విభాగాల పనితీరులను విశ్లేషించి ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఈ జాబితాలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్యు) అత్యధిక ర్యాంక్ పొందిన భారతీయ విశ్వవిద్యాలయంగా నిలిచింది. బుధవారం విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో డెవలప్మెంట్ స్టడీస్ సబ్జెక్ట్ కేటగిరీలో జెఎన్యు 20వ స్థానంలో నిలిచింది. భూగోళశాస్త్రం, చరిత్ర, ఆధునిక భాషలు, రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ఆంత్రోపాలజీ, ఆంగ్ల భాష, సాహిత్యం, భాషాశాస్త్రం సబ్జెక్టులలో జెఎన్యు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ సబ్జెక్టులో 22వ ర్యాంక్ను కైవసం చేసుకుంది. బెంగళూరు అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ సబ్జెక్టులో ఐఐఎం మొదటి స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి బొంబాయి ఇంజనీరింగ్-మినరల్ అండ్ మైనింగ్ సబ్జెక్టులో 25వ ర్యాంక్ సాధించింది. పెట్రోలియం ఇంజినీరింగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (ఐఐటిఎం) 29వ స్థానంలో నిలిచింది. క్యూఎస్ ప్రకారం, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న పరిశోధనా కేంద్రాలలో ఒకటిగా ఉంది.